హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151.46 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే వారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. గత నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మార్చి 23న వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులను కలిసి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేసేందుకు ప్రత్యేక సర్వే చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 1,51,645 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. మొత్తం 1,30,988 మంది రైతులు నష్టపోయినట్టు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.151 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది.
వరంగల్ జిల్లాలో భారీ నష్టం
వర్షాల వల్ల వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 60,936 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ఖమ్మం జిల్లాలో 23,632 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 11,685 ఎకరాలు, కరీంనగర్లో 8,166 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7,493 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చింది.
నేరుగా రైతుల ఖాతాల్లోకి సొమ్ము
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని మంజూరు చేయడంతో వచ్చే వారం నుంచి ఈ సొమ్మును పంపిణీ చేయడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ సాయాన్ని జమ చేయనున్నారు. ఇందుకోసం బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈవోలు ఇప్పటికే సేకరించారు.