వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల కోసం రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో భర్తీచేసే ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ ప్రకారం 3,200 పోస్టులు ఉన్నాయని తెలిపారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కోచింగ్ కోసం 1,300 అప్లికేషన్స్ రాగా, అందులో 700 మందికి బీసీ స్టడీ సరిల్స్లో అవకాశం కల్పించామని, రూ.55 లక్షలు ఖర్చు పెట్టి 200 మందికి వివిధ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ దివ్యాంగుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీవీసీసీ జీఎం ప్రభంజన్రావు, ఐఆర్ఎస్ సతీశ్, రంగారెడ్డి, హైదరాబాద్ డీడబ్ల్యూవో మోతి, రాజేందర్, దివ్యాంగుల సంఘాల నాయకుడు నారా నాగేశ్వరరావు, పల్లెబోయిన సుధాకర్వర్మ తదితరులు పాల్గొన్నారు.