Governor Tamilisai | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్గా నియమితులైననాటినుంచీ తెలంగాణపై తమిళిసై సౌందరరాజన్ విద్వేషం వెళ్లగక్కుతున్నారు. ప్రజా ప్రయోజన బిల్లులను తిప్పి పంపడం.. తిరస్కరించడమే ఆనవాయితీగా పెట్టుకొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపుదిద్దుకొంటున్న అద్భుత కట్టడాలపైనా విషం చిమ్మారు. రాజ్భవన్ను గవర్నర్ తమిళి సై ఫక్తు కాషాయ భవన్గా మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై కుతంత్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మరిచి.. రాజ్భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కారు. రాజ్భవన్లో జెండాఆవిష్కరణ తర్వాత గవర్నర్ తెలంగాణ ప్రజలపై తన విద్వేషాన్ని ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలంటూనే ‘కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, కొంతమందికి తాను నచ్చడం లేదు’ అని సాక్షాత్తు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంపై ఆమె తన అక్కసును వెళ్లగక్కారు. పరేడ్గ్రౌండ్లో అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం రాజ్భవన్లో ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, వారి కోసం చేస్తున్న కోట్లాది రూపాయల ఖర్చు, పేదల కోసం లక్షల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి ప్రస్తావన తేకుండా రాష్ట్ర ప్రగతిపై నిందలేశారు.
‘ఇది రాజ్భవన్ కాదు.. ప్రజాభవన్’, ‘24 గంటలు రాజ్భవన్ తలుపులు తెరిచే ఉంటాయి’ అని పేర్కొన్న రాష్ట్ర గవర్నర్ తాను నిర్వహించే ప్రజాదర్బార్కు ప్రజాప్రతినిధులకు అనుమతివ్వని దాఖలాలు అనేకం ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి వినతి పత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఇతర మహిళా కార్పొరేటర్లు వెళ్తే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిసేందుకు ప్రయత్నించిన సందర్భంలో స్పందిచని వైనం తెలిసిందే. ‘అమ్మా మా బాధ వినండి.. మా నాయకురాలికి న్యాయం చేయండి.. బండి సంజయ్పై చర్యలు తీసుకోండి’ అని మహిళా ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే రాజ్భవన్ పోలీసులతో గెంటివేయించారు. అదే బీజేపీ గల్లీ లీడర్ కూడా రాజ్భవన్లో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉంటారని, వారిని పిలిపించుకొని మరీ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం ఆమె వివక్షకు అద్దంపడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారని అక్కున చేర్చుకొని వారి కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం’ అని చారిత్రక నిర్ణయం తీసుకొని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును రూపొందించింది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపితే జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది రాజ్భవన్ ముట్టడికి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాగ్రహాన్ని గ్రహించిన గవర్నర్ ‘ఇదంతా మీ కోసమే….’ అన్నట్టు నమ్మబలికి ఆఖరికి బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
తిప్పి పంపటం…తిరస్కరించడం రాష్ట్ర గవర్నర్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను నెలలపాటు తన దగ్గరే అట్టిపెట్టుకున్న గవర్నర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో హడావిడిగా బిల్లుల ఆమోదానికి సిద్ధపడ్డారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశించినా మళ్లీ మూడు బిల్లులను తనవద్దే ఉంచుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు’ ‘తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు’ ‘డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లు’లకు సంబంధించి కొన్ని కొర్రీలు పెట్టి అనధికారికంగా మీడియాకు లీకులిచ్చింది కళ్లముందటి చరిత్ర.
రాజ్భవన్కు ఉన్నది కాషాయదిల్ తప్ప కామన్దిల్ లేదని గవర్నర్ తమిళి సై అనేక సందర్భాల్లో నిరూపించారు. రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం లాంటి కార్యక్రమాలకు అందరికీ ఆహ్వానాలు అందవనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. రాజ్భవన్లో జరిగే పలు కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందదని, అది కేవలం బీజేపీ ఎంపిక చేసినవారికి లేదా బీజేపీ రూపొందించిన జాబితా ఉన్నవారికే అందుతాయని ప్రజాప్రతినిధులు, ప్రజాప్రాతినిధ్య (ఎమ్మెల్సీ) సభ్యులు అనేకసార్లు ఆరోపించిన దాఖలాలు ఉన్నాయి. రాజ్భవన్లో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా రాజ్భవన్ వర్గాల కంటే తమకు బీజేపీ నేతల ద్వారా సమాచారం బయటకు వస్తున్నదని అనేక మంది బాహాటంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ప్రజాప్రతినిధులు రాజ్భవన్ను రాజకీయ భవన్ అని, కాషాయభవన్ అని ఆరోపించిన సందర్భాలున్నాయి.