హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల సేకరణను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మంగళవారం ప్రారంభించారు. పతాక దినోత్సవ జెండాను ధరించిన గవర్నర్ రాజ్భవన్లో సైనిక సంక్షేమశాఖ అధికారులకు తన వంతు విరాళాన్ని సమర్పించారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా సైతం సైనిక సంక్షేమశాఖ అధికారులు, ఎన్సీసీ వాలంటీర్లకు తమ వంతు విరాళాలను అందజేశారు. సైనికులకు సంఘీభావాన్ని ప్రకటించడంతోపాటు సైనికుల సంక్షేమం, మాజీ సైనిక కుటుంబాలకు పునరావాసం కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ నిధికి.. స్టిక్కర్లు, ఫ్లాగ్లను విక్రయించడమే కాకుండా హుండీల ద్వారా పౌరుల నుంచి కూడా వచ్చేఏడాది మార్చి 31 వరకు విరాళాలను సేకరించనున్నట్టు తెలంగాణ సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ కర్నల్ రమేశ్కుమార్ తెలిపారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్డే ఫండ్ (ఏఎఫ్ఎఫ్డీ), అకౌంట్ నంబర్ 52188926279, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0020073 MICR కోడ్ – 500004057, ఎస్బీఐ, శాంతినగర్ బ్రాంచ్, హైదరాబాద్ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.