హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. అక్కడ కూడా సీఎం కేసీఆర్పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన రాజకీయ ప్రసంగం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని, పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు మండిపడుతున్నారు. ఇది చాలనదన్నట్టు టీవీ డిబేట్లో పాల్గొనడంతో ఆమె ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయిందని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే ఆమె ఢిల్లీ డైరెక్షన్లో నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదమవుతూ వస్తున్నది. ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న కేరళ, తర్వాత తమిళనాడులో, తాజాగా తెలంగాణలో గవర్నర్ల పనితీరు విమర్శల పాలవుతోంది. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అక్కడి గవర్నర్లపై అక్కడి ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. ఆ వేడి చల్లారకముందే తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. దీంతో కేంద్రం చేతిలో కీలుబొమ్మగా గవర్నర్ల వ్యవస్థ మారిపోతున్నదన్న విమర్శలున్నాయి. కేంద్రంలో అధికార మార్పిడి జరిగిన ప్రతీసారి అంతకుముందు ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించడం సంప్రదాయంగా మారింది. దీన్ని సాకుగా తీసుకునే కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ తాను నియమించుకున్న గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ర్టాల్లో సమస్యలు సృష్టించడమే పనిగా పెట్టుకోవడం పరిపాటిగా మారింది. అందుకే గవర్నర్గిరీని విలువైన వృద్ధాశ్రమంగా పరిశీలకులు అభివర్ణించారు. ఇందుకు చరిత్రలో చాలా ఉదంతాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా చేయడంలో అప్పటి గవర్నర్, కాంగ్రెస్కు చెందిన రామ్లాల్ ఎలాంటి పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ను ఓ క్రిమినల్ కేసు విషయంలో పోలీసులు ప్రశ్నించారు. ఇలా జరగడం గవర్నర్ల వ్యవస్థలో ఇదే తొలిసారి. ఇదే కేసులో గోవా గవర్నర్ భరత్ వీర్ వాంచును కూడా సీబీఐ ప్రశ్నించాలనుకుంది.
రాష్ట్ర వ్యవహారాల నిర్వహణలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ప్రమాణ స్వీకారంలో పొందుపరిచిన రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ ప్రాథమిక విధి. కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలుంటాయో రాష్ట్రంలో గవర్నర్లకు అలాంటి అధికారాలే ఉంటాయి. రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా గవర్నర్ పనిచేస్తారు. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ విధులను పర్యవేక్షిస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, మొదటి సెషన్ ప్రారంభంలో కూడా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా గవర్నర్ రాష్ట్ర శాసనసభను ప్రారంభిస్తారు. ఈ సందర్భాలలో సాధారణంగా గవర్నర్ల ప్రసంగం ఆ రాష్ట్ర ప్రభుత్వ కొత్త విధానాలను వివరిస్తుంది. కానీ బీజేపీ పాలనలో గవర్నర్ల వ్యవస్థ చెడ్డ పేరు మూటకట్టుకుంటున్నది.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సి ఉండగా, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండటంపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఆమె, ఇపుడు కూడా బీజేపీ నాయకురాలిననే భావనతో మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనం రాజ్భవన్ అధికారిక వెబ్సైట్లో ప్రధాని మోదీ ఫొటో ఉండటమే. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ్భవన్ వెబ్సైట్ల ప్రొఫైల్లో మోదీ ఫొటోలు లేవు. కానీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అందుకు విరుద్ధంగా మోదీ ఫొటోను ప్రముఖంగా పెట్టడం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు కూడా రాజ్భవన్ వెబ్సైట్ ప్రొఫైల్లో ప్రధాని ఫొటోను పెట్టుకోలేదు. తెలంగాణ రాజ్భవన్ వెబ్సైట్ ఫొటోగ్యాలరీలోనూ ప్రధాని ఫొటోలే ఎక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉండగా ఆమె ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, గవర్నర్ను సమర్ధిస్తూ ఫ్లెక్సీలు వెలియడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.