ప్రతిపక్ష నేతలా ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారిందట
దవాఖానల్లో వసతులు లేవని, అవినీతి పెరిగిందని ఫక్తు పొలిటికల్ కామెంట్స్
తమిళిసై తీరుపై పరిశీలకుల విస్మయం
హైదరాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దవాఖానల్లో కనీస వసతులు లేవని, యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీన పరుస్తున్నదని, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నదని ఫక్తు రాజకీయ నేతలా మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశం తర్వాత రోజుకోరకంగా రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఆమె, గవర్నర్గా కాకుండా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలే గవర్నర్ నోటి వెంట కూడా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీలో గురువారం గవర్నర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
డ్రగ్స్ మహమ్మారి ప్రపంచ సమస్య
మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, వినియోగం అనేది ఒక రాష్ర్టానికో దేశానికో సంబంధించిన సమస్య కాదు. ఇది నేడు ప్రపంచ సమస్య. మన దేశంలో డ్రగ్స్పై యుద్ధం మొదలుపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. డ్రగ్స్ విక్రేతలతోపాటు వినియోగించిన వారిని కూడా వదిలిపెట్టకుండా దర్యాప్తు జరుపుతున్నది. వీఐపీలు, సెలబ్రిటీలను కూడా పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారించింది. మొన్నటికి మొన్న ఓ పబ్పై ఉక్కుపాదం మోపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గుడుంబా, పేకాట క్లబ్బులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. దీంతో నేడు రాష్ట్రంలో ఆ పదాలే వినిపించటంలేదు. మొన్నటిదాకా పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్కు కేంద్రంగా కొనసాగింది. దానిపై ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ తీరంలో గతేడాది వేలకోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంటే గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారిందని అనగలమా? అని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే సాక్షాత్తూ దేశ రాజధాని విమానాశ్రయంలోనే కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్ధాలు దొరికాయి. అందుకు ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయగలమా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో పెకళించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే పోలీస్శాఖకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా వేసి ఉక్కుపాదం మోపుతున్నది. నిజానికి డ్రగ్స్ తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నదే కానీ.. ఇక్కడికి సరఫరా కావటంలేదని అధికారులు అంటున్నారు.
దవాఖానల్లో వసతులు లేకుంటే కరోనాను జయించిందెలా?
దేశాన్ని కుదిపేసి కరోనా మహమ్మారిని సమర్ధంగా నిలువరించి ఏకైక రాష్ట్రం తెలంగాణే. గవర్నర్ చెప్తున్నట్టు రాష్ట్రంలో దవాఖానలు అధ్వాన్నంగా ఉంటే, వైద్యారోగ్య సేవలు బాగాలేకపోతే కరోనాను ఎలా అడ్డుకొన్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు కేటాయించిన పడకలు ఖాళీగానే ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కరోనా రోగులు హైదరాబాద్కు వచ్చి చికిత్స పొందారని, ఇక్కడ వసతులు లేకుంటే ఎందుకు వస్తారని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కరోనా సమయంలో ఒక్క నెలలోనే గచ్చిబౌలిలో ప్రభుత్వం వెయ్యి పడకల టిమ్స్ దవాఖానను సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న దవాఖానలను మరింత బలోపేతం చేయటంతోపాటు హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టింది. వరంగల్లో పది అంతస్తుల్లో అతిపెద్ద దవాఖానను నిర్మిస్తున్నది. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలతో దేశంలోని వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. నేడు గ్రామ, మండలస్థాయి దవాఖానల్లో కూడా మందుకులకు కొరత లేదని అధికారులు అంటున్నారు. ఇవన్నీ గవర్నర్కు తెలియవా? అని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచిన విషయం తెలిసిన వెంటనే బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొన్నది. కేసీఆర్ కిట్ పథకం దేశంలోనే ఒక సంచలనమని, గవర్నర్ ఈ విషయాలన్నీ విస్మరించి ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
విద్యాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినన్ని కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రమూ చేపట్టలేదు. పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్న గురుకులాల నుంచి అత్యుత్తమ ఉన్నత విద్య వరకు అనేక విప్లవాత్మక చర్యలు తీసుకొన్నదని టీఆర్ఎస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. యూనివర్సిటీల్లో వేల పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ యూనివర్సిటీలో పురుషుల కంటే అమ్మాయిల సంఖ్య పెరిగిందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
అవినీతిరహితంగా రాష్ట్రంలో పాలన కనిపించలేదా
దేశంలో నేడు అత్యుత్తమ, అత్యంత క్లీన్ చిట్ ఉన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందున్నారు. ఎనిమిదేండ్ల పాలనలో సీఎంపైగానీ, ప్రభుత్వంపైగానీ, మంత్రులపైగానీ ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. తన కన్నబిడ్డలే అవినీతికి పాల్పడినా ఉపేక్షించబోనని కేసీఆర్ అనేకసార్లు స్పష్టంచేశారు. మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొత్తలో నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టీ రాజయ్యపై అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని టీఆర్ఎస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రాష్ట్రంలో వేలకోట్లతో సంక్షేమ పథకాలు, లక్షలకోట్లతో ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. అయినా ఒక్క మంత్రిపైగానీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులపైగానీ ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని పరిశీలకులు అంటున్నారు. నిత్యం అవాకులు చవాకులు పేలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లాగే గవర్నర్ మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్పై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించడంతో పాటు అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.