హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏడు దశాబ్దాల్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఐక్యత, సమగ్రత, విశిష్టత, భిన్నత్వాన్ని కాపాడటంలో రాజ్యాంగమే అత్యున్నత శక్తిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆదర్శాలు, విలువల కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాజ్భవన్లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిని నిర్మించడంలో రాజ్యాంగం ప్రబల శక్తిగా పనిచేసిందని పేర్కొన్నారు. దేశం ఇంకా కొవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడలేదని, ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫలితం ఉండదని హెచ్చరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ మాట్లాడుతూ.. రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. ప్రతి పౌరుడి జీవన విధానం, జీవనోపాధి, సంస్కృతి, వ్యవస్థలన్నీ రాజ్యాంగాన్ని అనుసరించే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు కే తారకరామారావు, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.