హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): జల వివాదాలకు సంబంధించి పలుమార్లు విన్నవించినా కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పందన లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయా అంశాలపై 70కి పైగా లేఖలు రాసినా, ఏ ఒక్కదానికీ జవాబు రాకపోవడాన్ని ఆక్షేపిస్తూ.. కేఆర్ఎంబీకి శనివారం ఘాటుగా లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగునీటి పారుదలశాల శాఖ ఈఎన్సీ మురళీధర్ రాసిన ఈ లేఖలో.. తెలంగాణ అభ్యంతరాలపై, ఏపీ అక్రమాలపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కృష్ణాజల వివాదాలపై ఇంతవరకు రాసిన 70 లేఖలను ఏ ఏ తేదీల్లో పంపామో పూర్తి జాబితాను లేఖతోపాటు జతచేశారు. ఇకనైనా సమస్యలను పరిష్కరించాలని, ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.