హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేయించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం వద్ద బ్యాక్ వాటర్ ప్రభావం నిరంతరం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి లేఖ రాశారు. ఇప్పటికే దీనిపై కేంద్ర జల్శక్తిశాఖకు, సీడబ్ల్యూసీకి విన్నవించినట్టు గుర్తుచేశారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తే వాటిల్లే ముంపు ప్రభావంపైనే సీడబ్ల్యూసీ, ఏపీ అధ్యయనం చేశాయని తెలిపారు.
భద్రాచలం, మణుగూరు భారజల కేంద్రం, నదీ పరివాహక ప్రాంతంలోని బొగ్గు గనులు, తెలంగాణలోని 74 గ్రామాలు ముంపునకు గురవుతాయని నిర్ధారించాయన్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని, తెలంగాణలోని 99 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, 1.2 లక్షల మంది ముంపు ప్రభావానికి లోనవుతారని వివరించింది. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ ఉన్నపుడు ఇంకా ఎక్కువ ముంపు ఉంటుందనే భయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా వచ్చిన వరదతో ముంపునకు గురైన ప్రాంతాలను లేఖలో ఉదహరించింది. ఈ నేపథ్యంలో అవసరమైన రక్షిత కట్టడాలు, నివారణ చర్యలు చేపట్టాలని, అందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న పీపీఏనే చొరవ చూపాలని కోరింది.