హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): నదీ పరీవాహక రాష్ర్టాల అభ్యంతరాలు, ట్రిబ్యునల్ అవార్డులను పరిశీలించకుండా కేవలం కర్ణాటక ప్రభుత్వమే సొంతంగా చేసుకొన్న నీటి కేటాయింపుల ఆధారంగా అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు ఏవిధంగా అనుమతులిస్తారని సెంట్రల్ వాటర్ కమిషన్ను తెలంగాణ సర్కారు నిలదీసింది. ఆ ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులను నిలిపేయాలని డిమాండ్చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్టు అప్రైజల్ (సౌత్) డైరెక్టరేట్కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం లేఖ రాశారు. కర్ణాటక చేపట్టిన అప్పర్భద్ర, అప్పర్తుంగ ప్రాజెక్టులపై అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అంతర్రాష్ట్ర అంశాలను, ట్రిబ్యునల్ 1 అవార్డును పరిగణనలోకి తీసుకోకుండా అనుమతిలివ్వడం సరికాదని సీడబ్ల్యూసీకి సూచించారు.
కృష్ణా బేసిన్లో ఇప్పటికే తీవ్ర నీటిలోటుందని ఉన్నదని, తుంగభద్ర బేసిన్ నుంచే నిరంతరాయంగా నీరు రావాల్సి ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటిరాక తగ్గిపోయి, దిగువనున్న తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కే-8లోని తుంగభద్ర సబ్ బేసిన్, ఇతర బేసిన్లకు ట్రిబ్యునల్చేసిన నీటి కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, పరిమితులను విధించిందన్నారు. తుంగభద్ర సబ్బేసిన్లో ఎక్కడెక్కడ.. ఎంత మొత్తంలో నీటిని వినియోగించుకోవాలో నిర్దేశించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అప్పర్భద్ర, అప్పర్తుంగకు ట్రిబ్యునల్1 నీటిని కేటాయించలేదని స్పష్టంచేశారు.
తుంగభద్ర సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యతపై అధ్యయనం చేసి అంచనావేసిన తరువాతే నీటిని కేటాయించాలని పేర్కొన్నదని తెలిపారు. ట్రిబ్యునల్ 2 ఈ మేరకు కే 9 సబ్ బేసిన్లోని నీటి లభ్యతను అంచనా వేసిందని చెప్పారు. అనంతరం 65 శాతం డిపెండబులిటీ కింద అప్పర్భద్రకు 9, అప్పర్ తుంగా 11 టీఎంసీలను కేటాయించిందని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని, విచారణ కొనసాగుతున్నదని తెలంగాణ ఈఎన్సీ గుర్తుచేశారు. నదీ పరీవాహక రాష్ర్టాల అవసరాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేశారు. లేఖతోపాటు ట్రిబ్యునల్ 1 అవార్డు కాపీలతోపాటు పలు పత్రాలను జతచేసింది.