హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తున్నదని అన్నారు. ఆచార్య జయశంకర్ సార్ సేవలకు గుర్తుగా వ్యవసాయ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేస్ శ్రీనివాస రాజు, చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జయప్రకాశ్ విద్యాసంస్థల చైర్మన్ రవికుమార్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధీప్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.