హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన అభిమానులను పరామర్శించిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనంతరం వారితో కలిసి మ్యాచ్ వీక్షించారు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించగా.. పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు రోహిత్సేనను ఉత్సాహ పరిచారు. హైదరాబాద్లో చివరిసారిగా 2019లో వెస్టిండీస్తో టీ20 మ్యాచ్ జరుగగా.. ఆ తర్వాత కరోనా కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించలేదు. దీం తో మూడేండ్ల తర్వాత జరుగుతున్న పోరు కావడంతో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల కోసం ఇటీవల జింఖానా మైదనంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడగా.. వారిని మ్యాచ్ ఆరంభానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగడం దురదృష్టకరమన్న మంత్రి.. గాయపడ్డ వారికి ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిని ప్రత్యేక వాహనంలో మైదానానికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి వారితో కలిసి మ్యాచ్ చూస్తూ ఆనందించారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడి ఊపిరి ఆడక ఇబ్బంది పడిన వారికి సత్వర సాయంగా ‘సీపీఆర్’అందించిన బేగంపేట కానిస్టేబుల్ నవీనకు పదోన్నతి కల్పించాలని హైదరాబాద్ కమిషనర్కు సిఫారసు చేసిన మంత్రి.. మరో కానిస్టేబుల్ విమలకు రివార్డు అందించాలని కోరారు.