ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్ఐసీయూ, దవాఖాన ప్రాంగణం అంతా క్షుణ్నంగా పరిశీలించారు. ఘటనకు కారణాలను ఆరా తీసిన విచారణ అధికారులు నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
ఎంజీఎం సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్గా ఉన్న చంద్రశేఖర్కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.