హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులతో అమలులోకి వచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు నిర్వహించాలని అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, 33 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లు అమలులోకి వచ్చాయని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నియామకాలు, పదోన్నతులన్నీ ఇక నుంచి నూతన జోనల్ వ్యవస్థ ప్రకారమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు.