సీఎస్ కమిటీ చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు ఆనుకొని ఉంటూ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన జీవో 111 పరిధిలోని గ్రామాల్లో వెలుగు నిండనున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆంక్షల కత్తి వేలాడుతున్న 84 గ్రామాలకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయం మేరకు జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు (జీవో నంబరు 69) జారీ చేశారు. మరోవైపు, ఈ జీవో ప్రధాన ఉద్దేశమైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోనున్నది. జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.
త్వరితగతిన నివేదిక సమర్పించాలంటూ కమిటీని ఆదేశించిన ప్రభుత్వం.. కమిటీ అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొన్నది. హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా కోసం హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయాలను పరిరక్షించేందుకు 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల రెండు జలాశయాలకు పది కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు అమలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గాల పరిధిలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నా, ఈ గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల్లో వ్యవసాయం మినహా ఏ రంగాల్లోనూ అభివృద్ధి జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హైదరాబాద్కు ఈ జంట జలాశయాల నుంచి తాగునీటిని అందించాల్సిన అవసరం లేకుండాపోయింది. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో ‘111 జీవోను ఎత్తివేస్తాం’ అని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ హామీని నిలబెట్టుకొన్నారు. ఇందులో భాగంగానే బుధవారం జీవో 69 జారీ అయ్యింది.
తాగునీటి అవసరం లేదు
జంట జలాశయాల పరిరక్షణకు 1996లో జీవో 111 ఇచ్చిన సమయంలో ఈ రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్కు పెద్దఎత్తున నీటి సరఫరా జరిగేది. నగర తాగునీటి సరఫరాలో ఏకంగా 27.59 శాతం మంచినీళ్లు ఈ జంట జలాశయాల నుంచి వచ్చినందున అప్పట్లో అంతగా ఆధారపడాల్సి వచ్చిందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల నుంచి శాశ్వత పరిష్కార ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో ఈ జంట జలాశయాల నుంచి నగరానికి వచ్చే నీటి పరిమాణం 1.25 శాతానికి పరిమితమైందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, 1996లో హైదరాబాద్లో రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల మంచినీటి సరఫరా ఉంటే ఇప్పుడు రోజుకు 602 మిలియన్ల గ్యాలన్ల సరఫరా ఉన్నదని, 344 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరాకు సంబంధించిన పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు ప్రభుత్వం వివరించింది.
సీఎస్ నేతృత్వంలో కమిటీ
జంట జలాశయాలను పరిరక్షించేందుకుగాను చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించేందుకుగాను ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు జీవోలో వెల్లడించింది. సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అర్వింద్ కుమార్, రామకృష్ణారావు, రజత్ కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ను కూడా జీవోలో పేర్కొన్నారు.
జలాశయాల పరిరక్షణకు ఢోకా లేకుండా..
జీవో 111లో పేర్కొన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నప్పటికీ జంట జలాశయాల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధానంగా జలాశయాల్లోని నీరు కలుషితం కాకుండా, నీటి నాణ్యత పెంపొందించేందుకు చేపట్టే చర్యలను వెల్లడించింది.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల ప్రజలకు గుదిబండలా మారిన జీవో 111 ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. అప్పట్లో ఈ జీవోను అశాస్త్రీయంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటూ, సీఎస్ నేతృత్వంలో కమిటీ వేయడం శుభపరిణామం. సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్కు ఆయా గ్రామాల తరఫున కృతజ్ఞతలు. – మంత్రి సబితాఇంద్రారెడ్డి
చెప్పింది చేసి చూపించారు
సీఎం కేసీఆర్ మరోసారి చెప్పింది చేసి చూపించారు. ఇన్నేండ్లుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జీవో 111 పరిధిలోని 84 గ్రామాల ప్రజల సమస్యలను పట్టించుకొన్న పాపానపోలేదు. ఆ గ్రామాల ప్రజల కష్టాలు తెలుసుకొన్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు. 84 గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు.
– చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి