Govt Hospitals | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీశ్రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం డెలివరీలు జరుగగా.. ప్రస్తుతం 73 శాతానికి చేరడం గొప్ప విషయమని మంత్రి ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్యశాఖ పనితీరుకు, పురోగతికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో పెరుగుతున్న డెలివరీలు సర్కారు వైద్య సేవలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి, నమ్మకానికి గొప్ప ఉదాహరణలని తెలిపారు. జూలై నెలలో అత్యధికంగా నారాయణపేట జిల్లా లో 86.9%, మెదక్ 83.5%, జోగులాంబ గద్వాల 81.1% ప్రసవాలు జరిగాయని, డెలివరీలు తకువగా నమోదవుతున్న వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో ఫలితాలు మెరుగుపడాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేసిన సిబ్బందికి టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. నిరుడు రూ.1.60 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చామని గుర్తుచేశారు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో జోగులాంబ గద్వాల, మెదక్, నాగర్కర్నూల్ జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయని చెప్తూ.. ఆయా జిల్లాల సిబ్బందిని మంత్రి అభినందించారు. వ్యాక్సినేషన్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను మంత్రి మెచ్చుకున్నారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 134 రకాల పరీక్షలు ప్రజలకు అందాలని మంత్రి హరీశ్రావు సూచించారు. కచ్చితంగా 24 గంటల్లోగా పరీక్షల ఫలితాలు అందించేలా చూడాలని ఆదేశించారు. నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ కార్యక్రమంలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు, మొదటి స్థానానికి చేరేందుకు కృషి చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లోని దవాఖానల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు నిర్వహించాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధవహించాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఫా సానింగ్ యంత్రాల వల్ల గర్భిణులకు ఎంతో మేలు కలిగిందని మంత్రి తెలిపారు. 43 దవాఖానల్లో 56 టిఫ్పా యంత్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 32 వేల స్కాన్స్ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి గర్భిణికి ఒక రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు, వైద్యం పూర్తి ఉచితంగా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.