హైదరాబాద్ : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి రూ. 70.51 కోట్లు మంజూరు చేస్తూ ఇవాళ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల మహిళా స్త్రీ-శిశు సంక్షేమశాఖ అధికారులతోపాటు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం లబ్ధిదారుల ఇంటికే ప్రభుత్వం చేరుస్తున్నది. రాష్ట్రంలోని 149 అంగన్వాడీ ప్రాజెక్టుల కింద ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని దాదాపు 21 లక్షల మందికి పౌష్టికాహారాన్ని (టేక్హోం రేషన్) ఇంటింటికీ అందిస్తున్నది.