హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ పేరు వింటే అందరికీ భయమే. మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహార అలవాట్లతో ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ప్రాథమిక దశలో ఈ వ్యాధిని గుర్తించకపోవడంతో ముదిరాక చాలామంది దవాఖానలకు పరుగులు తీస్తుంటారు. దీన్ని నివారించి ఆదిలోనే వ్యాధి లక్షణాలు పసిగట్టేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ప్రజల వద్దకే వైద్యులు వెళ్లి స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రారంభించిన మొబైల్ స్క్రీనింగ్ వాహనం రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి సేవలు అందిస్తున్నది. అక్కడికక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తూ, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎంఎన్జే హాస్పిటల్ను సందర్శించినప్పుడల్లా మొబైల్ స్క్రీనింగ్ గురించి ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
ప్రజలకు రూ.2.30 కోట్ల మేర ఆదా
మొబైల్ స్క్రీనింగ్ వాహనంలో డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, మైక్రోస్కోప్, సీఆర్ సిస్టమ్ తదితర అధునాతన పరికరాలు ఉంటాయి. ఇందులో 15 మంది సిబ్బంది ఉంటారు. గైనకాలజిస్ట్, పాథాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్ ఉంటారు. వీరితోపాటు ఒక మమోగ్రఫీ టెక్నీషియన్, పాథాలజీ టెక్నీషియన్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఆయా ఉంటారు. వీరు నిత్యం 200-250 మంది వరకు స్క్రీనింగ్ చేస్తారు. పరీక్షల అనంతరం ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తారు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో డిజిటల్ మమోగ్రఫీ, ఇతర ప్రాథమిక పరీక్షలకు సుమారు రూ.6-7 వేల వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 3,520 మందికి స్క్రీనింగ్ చేయగా, బాధితులకు సుమారు రూ.2.30 కోట్ల వరకు ఖర్చు ఆదా అయ్యింది. రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.650 కోట్లు వెచ్చించింది. వ్యాధి ముదిరి చివరిదశలో ఉన్నవారికి సాంత్వన కలిగించేందుకు ప్రతి జిల్లాలో పాలియేటివ్ కేర్ సెంటర్లను నెలకొల్పింది.
45 దాటినవారు స్క్రీనింగ్ చేసుకోవాలి
మారుతున్న ఆహార అలవాట్లతో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. 45 ఏండ్లు దాటిన వారికి ముప్పు అధికం. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లోనూ క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 230 మందికి పరీక్షలు నిర్వహిస్తే 13 మందికి అనుమానిత లక్షణాలు కనిపించాయి. వీరికి హైదరాబాద్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మెరుగైన వసతులు సమకూరాయి.
-డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్
జనవరి నుంచి ఇప్పటివరకు స్క్రీనింగ్ వివరాలు
మొత్తం క్యాంపులు : 36
స్క్రీనింగ్ చేసిన సంఖ్య : 3,520
అనుమానిత లక్షణాలు ఉన్నవారు : 231
క్యాన్సర్ సోకినట్టు తేలినవారు : 62
చికిత్స పొందుతున్నవారు : 71