హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు వివరించారు. పూర్తి వివరాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డిమందుగా గుర్తించబడిన పారాక్వాట్ను నిషేధించినట్టు తెలిపారు. రాష్ట్రానికి ఏప్రిల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. యూరియా డిమాండ్ అధికంగా ఉండే జూన్, జూలై వరకు బఫర్ స్టాక్ను వీలైనంత ఎక్కువగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
వానకాలానికి సంబంధించి రాష్ట్రానికి యూరియాను సకాలంలో అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్కు విజ్ఞప్తి చేశారు. కొరత లేకుండా రైతులకు ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో చర్యలు కొనసాగించాలని కోరారు. బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వివిధ రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో రాష్ట్రం దేశంలోనే ముందు ఉన్నట్టు మంత్రి తుమ్మల కేంద్ర మంత్రికి తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామని, వచ్చే మూడు నెలల్లో పూర్తిచేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. రాష్ట్రంలో యూరియా లభ్యత, పంపిణీ, ఫర్టిలైజర్ యాప్ అమలు గురించి సైతం కేంద్ర మంత్రికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించేలా మరో సానుకూల పరిణామం చోటుచేసుకున్నదని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్పామ్ గెలల ధర టన్ను ధర రూ.23,005కి పెరిగిందని వెల్లడించారు. ఇప్పటివరకు టన్ను ధర రూ.21,546గా ఉండగా, రూ.1,459 పెరిగినట్టు తెలిపారు.