Telangana | హైదరాబాద్ : వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం రాయితీ కల్పించింది. రూ. 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీ, టూ వీలర్స్పై 80 శాతం, ఆటోలు, ఫోర్ వీలర్పై 60 శాతం రాయితీ, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
2022, ఫిబ్రవరి నెలలో పెండింగ్ చలాన్లపై నాటి ప్రభుత్వం రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, లైట్, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. నాడు రూ. 300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లపై వసూళ్లు అయ్యాయి.