హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీనితో రైతుబంధు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సీజన్లలో కలిపి మొత్తం 50,448 కోట్లను జమ చేసినట్టయ్యింది. ఈ సీజన్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రైతుబంధు నిధులు అందాయి. నల్లగొండలో 4.69 లక్షల మంది ఖాతాల్లో రూ.601.74 కోట్లను జమచేసింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు పంపిణీ చేసింది. రైతుబంధు నిధుల పంపిణీ 50 వేల కోట్ల మార్క్ను దాటిన నేపథ్యంలో పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు నిర్వహించారు.
వ్యవసాయ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఆత్మబంధువుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచిగా నిలిచారని అన్నారు. గత పాలకులంతా రైతులను ఓటు బ్యాంకుగా చూస్తే.. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి కడుపు నింపే ప్రయత్నం చేశారని కొనియాడారు. రాష్ర్టాలు, ప్రాంతాలను బట్టి పంటలకు మద్దతు ధర నిర్ణయించి, రైతులు పండించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనుగోలుచేయాలని అన్నారు.