హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) సంబంధించి ప్రస్తుతం కేవలం తాగునీటికి ఉద్దేశించిన పనులను మాత్రమే కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్జోన్ బెంచ్ ఎదుట వాదనలను బలంగా వినిపించింది. కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటిని, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగునీటిని అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పీఆర్ఎల్ఐఎస్కు శ్రీకారం చుట్టగా.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీకి చెందిన పలువురు గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్టుపై సంవత్సరాల తరువాత, రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసిన అనంతరం అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆక్షేపించింది. అయితే తెలంగాణ వాదనలను గ్రీన్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నామన్న పేరుతో పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం సరికాదని, ఈఐఏ నోటిఫికేషన్ 2016 ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరిని పేర్కొంది. అప్పటివరకు ప్రాజెక్టు పనులను నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులును జారీ చేసింది.
‘పాలమూరు’ కీలకాంశాలపై నవంబర్ 24న విచారణ
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఇతర కీలకాంశాలపై గ్రీన్ట్రిబ్యునల్ విచారణ నవంబర్ 24కు వాయిదాపడింది. ఎన్జీటీ నియమించిన సంయుక్త కమిటీ పాలమూరు రంగారెడ్డి పథకం పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి, గతంలోనే నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. తాగు, సాగునీటి బహుళ ప్రయోజనాలతో పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని చేపట్టామని, అందులో భాగంగా ప్రస్తుతం కేవలం తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను మాత్రమే కొనసాగిస్తున్నామని, అందుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ సర్కారు గతంలోనే స్పష్టం చేసింది. సాగునీటి ఎత్తిపోతలకు సంబంధించిన పనులకు సైతం ఇప్పటికే పర్యావరణ అనుమతుల కోసం ప్రక్రియను చేపట్టామని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయిందని తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలోని అప్రయిజల్ కమిటీ ఎదుట వాదనలు కొనసాగాల్సి ఉన్నదని వివరించింది. త్వరలోనే పర్యావరణ అనుమతులొస్తాయనే ధీమాను వ్యక్తం చేసింది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల సాధించిన తీరును ఉదహరించింది. తదుపరి విచారణను గ్రీన్ట్రిబ్యునల్ నవంబర్ 24కు వాయిదా వేసింది.