హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం (క్యూ1)లోనే ప్రభుత్వం రూ. 21,919.23 కోట్ల అప్పులు తెచ్చింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న వార్షిక రుణ సమీకరణ లక్ష్యం రూ.58 ,458.71 కోట్లలో ఏకంగా 37.5 శాతానికి సమానం. ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం నిరుటి కంటే స్వల్పంగా పెరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. సోమవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ వ్యయం రూ.54,815.34 కోట్లుగా ఉన్నది. ఇందులో ఉద్యోగుల జీతాలకు రూ.13,063.52 కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 27.01%), రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు రూ.7,309.49 కోట్లు ఖర్చయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి 26.1 శాతంగా ఉన్న పెన్షన్ల వ్యయం ఈసారి ఏకంగా 49.60 శాతానికి పెరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడులు రూ.42,525.96 కోట్లుగా ఉన్నాయి. ఇది రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన రూ.2.41 లక్షల కోట్ల వార్షిక రెవెన్యూ రాబడుల్లో కేవలం 17.63 శాతమే. ఇందులో భూమి శిస్తు (ల్యాండ్ రెవెన్యూ) ద్వారా రూ.20 లక్షలు మాత్రమే వచ్చింది. ఇది రూ.11.15 కోట్ల వార్షిక అంచనాలో కేవలం 1.79 శాతమే. నిరుడు ఇదే సమయానికి వార్షిక లక్ష్యంలో 2.86% భూమి శిస్తు వసూలైంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోనే సింహభాగం ఆదాయం లభించింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), సేల్స్టాక్స్, స్టాంప్ డ్యూటీల ద్వారా రూ.38,447.58 కోట్ల పన్నుల ఆదాయం సమకూరింది. కానీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 23.85 నుంచి ఏకంగా 15.68 శాతానికి పడిపోయింది.
కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర బడ్జెట్ నిర్వహణ ఎంతో లోపభూయిష్టంగా ఉన్నట్టు ద్రవ్యలోటు, రెవెన్యూలోటు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేయగా.. జూన్ చివరినాటికి రూ.12,289.38 కోట్ల భారీ రెవెన్యూ లోటు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర ద్రవ్యలోటు రూ.21,919.24 కోట్లకు చేరింది. ఇది రూ.58,458.71 కోట్ల వార్షిక అంచనాలో ఏకంగా 37.52 శాతానికి సమానం.
ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత లోపించడంపై ‘కాగ్’ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లకు రేవంత్రెడ్డి సర్కార్ ఇప్పటివరకు ఇచ్చిన గ్యారెంటీలు ఎంత? భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆ సంస్థలు సేకరించిన నిధుల వివరాలేమిటన్న కీలక సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ‘కాగ్’కు సమర్పించలేదు. దీనితోపాటు పబ్లిక్ అకౌంట్ నుంచి చేసిన డ్రాయల్స్, అప్పుల వివరాలను కూడా ప్రభుత్వం అందజేయలేదని ‘కాగ్’ పేరొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ అంచనాలతో తెలంగాంను కాగితాలపై సంపన్న రాష్ట్రంగా చూపిస్తూ ఆచరణలో మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదన్న ప్రతిపక్షాల విమర్శలకు ‘కాగ్’ నివేదిక మరింత బలాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో ఉత్పాదక రంగాలపై, పెట్టుబడి వ్యయంపై రేవంత్రెడ్డి సర్కార్ దృష్టి పెట్టకుండా కేవలం అప్పులతో పరిపాలన సాగించాలన్న విధానాన్ని కొనసాగిస్తే తెలంగాణ భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
