హైదరాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ): దళిత సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. ముగ్గురు దళిత యువనేతలను ఒకేసారి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. పదవులు వరించిన ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా క్రిషాంక్ను, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మౌలిక సదుపాయల సంస్థ చైర్మన్గా శ్రీనివాస్ను, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా సాయిచంద్ను నియమించారు. వీరి పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా తెలంగాణ సాధన కోసం ఉద్యమించే అవకాశం లభించింది. స్వ రాష్ట్రంలో తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాను. మరోసారి నా కు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. -ఎర్రోళ్ల శ్రీనివాస్
నేను ఉహించని విధంగా పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకేరోజు ముగ్గురు దళితులను చిన్న వయస్సులోనే పెద్ద పదవుల్లో నియమించారు. – క్రిషాంక్
ఉద్యమకారులకు దక్కిన గౌరవం
తెలంగాణ ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారనేందుకు నాకు ఇచ్చిన పదవే నిదర్శనం. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఆయన మొదటి నుంచి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారు. – సాయిచంద్