హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మహీంద్రా, ఒలెక్ట్రా, జెడ్ఎఫ్, మైస్ట్రాహ్, గ్రావ్టన్, హ్యుందయ్ మొబిస్, వన్ మోటో, ప్యూర్ ఈవీ వంటి కంపెనీలకు తెలంగాణ ఇప్పటికే నిలయంగా మారిందని పేర్కొన్నారు. ప్రగతిశీల ఈవీ పాలసీతోపాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా సామర్థ్యంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్’ స్టేట్గా అవతరించబోతున్నదని చెప్పారు. మాదాపూర్లోని హైటెక్స్లో బుధవారం ‘హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్’లో భాగంగా మొదటి ఎడిషన్ ‘ఈవీ మోటర్’ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఈవీ మోటార్ షోలలో ఒకటైన హైదరాబాద్ ఈ-మోటార్ షోను ప్రారంభించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. సుస్థిర భవిష్యత్తును సృష్టించడంపై తెలంగాణ దృష్టి పెట్టిందనడానికి ఈ ప్రదర్శన నిదర్శనమని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీని వినియోగించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.
ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు. పుష్కలంగా నీళ్లు, నాణ్యమైన విద్యుత్తు, సామాజిక మౌలిక వసతులు, అంకితభావం కలిగిన ఉద్యోగులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. కంపెనీలకు అవసరమయ్యే అత్యవసర సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. కొత్త సాంకేతిక రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉన్నదని చెప్పారు. ఈవీ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, టూవీలర్, త్రీవీలర్, బస్సులు తదితర వాహనాల విడి భాగాలు తెలంగాణలో తయారవుతున్నాయని తెలిపారు. అందుకోసం తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తున్నదని వెల్లడించారు.. అమరరాజా కంపెనీ ఇప్పటికే ఈవీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఈవీల తయారీ, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అడాస్, డిజిటల్ కాక్పిట్ సొల్యూషన్స్, వీ2ఎక్స్ కనెక్టివిటీ, ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీతో సహా దేశంలో అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని వివరించారు. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ మోడళ్లను ఆవిష్కరించడానికి హైదరాబాద్ ఈ-మోటార్ షో మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ – మోటర్ షోలో సిట్రాని ఎలెక్ట్రిక్ కార్, క్వాంటమ్ ఈవీ బైక్, హాప్ ఈ బైక్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఆ వాహనాలతో ఫొటోలు దిగటంతో నిర్వాహకులు, సందర్శకులు కేరింతలు కొట్టి జై కేటీఆర్ అని నినాదాలు చేశారు. టూవీలర్పై కూర్చొని విజయ సంకేతం చూపి, భవిష్యత్తు అంతా ఈవీలదేనని తయారీదారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ విభాగం స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ సుజై కారంపురి, అపోలో టైర్స్ హెడ్ అంకూర్ ఠాకుర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మోటర్ షో గురు, శుక్రవారాల్లో కూడా జరుగనున్నది. మోటర్ షోలో 60 స్టాల్స్ ఏర్పాటుచేశారు. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను పరిచయం చేశాయి. ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలు, టూ వీలర్లు.. ఇలా విభిన్న రకాల ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొచ్చాయి.