హైదరాబాద్, నమస్తే తెలంగాణ ; తెలంగాణ అమ్మాయిలు చదువుల్లో దూసుకుపోతున్నారు. ఉన్నతవిద్యలో బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నది. అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ బాలికలు మెరుస్తున్నారు. కేజీబీవీ మొదలు పీజీ వరకు అన్ని విద్యావిభాగాల్లోనూ వారి సంఖ్యే ఎక్కువ. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 72శాతం మంది అమ్మాయిలే. ఈ ఏడాది బీఎడ్లో అడ్మిషన్ పొందినవారిలో 81శాతం వారే. రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఉన్నతవిద్య గ్రామీణ విద్యార్థులకు మరింత చేరువైంది. ప్రత్యేక వసతుల కల్పనకు తోడు, ప్రభుత్వ ప్రోత్సాహంతో నాణ్యమైన బోధన లభిస్తున్నది. ఫలితంగా గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో అమ్మాయిలే అధికంగా చేరుతున్నారు. డిగ్రీ, బీఎడ్ ప్రవేశాలతోపాటు యూనివర్సిటీ విద్యవైపు వారు ఆసక్తిచూపుతున్నారు. ఫలితంగా ఉన్నతవిద్య చదువుతున్న అమ్మాయిల నిష్పత్తిలో దేశంలోనే టాప్ -5 రాష్ర్టాల్లో తెలంగాణ నిలుస్తుండటం గమనార్హం.
బాలికల విద్యలో దేశానికే తెలంగాణ దిక్సూచి
నాన్న చదువు బిడ్డ కడుపు నింపగలదు.. అదే అమ్మ చదువు తన బిడ్డలకు బంగారు జీవితాన్నివ్వగలదు.. నేటి బాలికలే రేపటి ఏలికలు అన్న మాటలను నిజం చేస్తూ అమ్మాయిలు చదువుల్లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది డిగ్రీ, పీజీ, బీఈడీ ప్రవేశాల్లో వారిదే ఆధిపత్యంగా కనిపిస్తున్నది. పీజీ కోర్సుల్లో 72 శాతం.. డిగ్రీలో 52 శాతం.. బీఈడీ కోర్సుల్లో 81 శాతం అమ్మాయిలే చేరారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన తెలంగాణ మహిళా వర్సిటీలో 490 పీజీ ఫస్టియర్ సీట్లుంటే అన్ని సీట్లను అమ్మాయిలకే కేటాయించారు. నిరుడు పీజీ ఫస్టియర్లో 70 శాతం అమ్మాయిలుంటే ఈ ఏడాది వారి సంఖ్య 72 శాతానికి చేరింది. యూనివర్సిటీల వారీగా ప్రవేశాల్లోనూ అమ్మాయిల హవానే కనిపిస్తున్నది. పాఠశాల విద్యలో కూడా బాలురతో సమానంగా బాలికలు చేరుతున్నారు.
హాస్టళ్లు కేటాయించలేనంతగా అడ్మిషన్లు
తెలంగాణ ప్రభుత్వం మహిళాశిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రభుత్వ పథకాలు సైతం బాలికల విద్యకు తోడ్పాటును అందిస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సైతం పరోక్షంగా అమ్మాయిల చదువుకు సహకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు బాలికలకు అండగా ఉంటున్నాయి. అడ్మిషన్లు పెరుగుతుండటంతో అమ్మాయిలకు హాస్టల్ వసతి సమస్యగా మారుతున్నది. గతేడాది అమ్మాయిల తాకిడి తీవ్రమవడంతో ఓయూలో అబ్బాయిల కోసం నిర్మించిన 650 మంది సామర్థ్యం గల హాస్టల్ను అమ్మాయిల కోసం కేటాయించారు. నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీల్లోని వారు ఓయూ క్యాంపస్ హాస్టళ్ల నుంచే రాకపోకలు సాగిస్తుండటంతో హాస్టళ్లు సరిపోవడంలేదు. దీనికి పరిష్కారంగా నిజాం కాలేజీలో 260 మంది సామర్థ్యం గల కొత్త హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించారు. కొత్తగా రూ.కోటి వ్యయంతో సైఫాబాద్లోనూ కొత్త హాస్టల్ను అందుబాటులోకి తేనున్నారు.
సీపీగెట్లో 72% సీట్లు మహిళలకే
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ (సీపీగెట్) రెండో విడత సీట్లను ఇటీవలే కేటాయించారు. ఇప్పటికే మొదటి విడతలో 72శాతం సీట్లను అమ్మాయిలే దక్కించుకొన్నారు. తాజాగా కేటాయించిన రెండో విడతలోనూ అత్యధిక సీట్లను వారే సొంతం చేసుకొన్నారు. ప్రతి క్యాటగిరీలోనూ అబ్బాయిలను వెనక్కి నెట్టేశారు. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్, ఎమ్మెస్సీ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ వంటి కోర్సుల్లో 85శాతానికి పైగా అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్టుగా అధికారులు వెల్లడించారు.
గురుకులాల్లోనూ పైచేయి..
గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ కోర్సుల్లో అమ్మాయిలే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ రంగ కాలేజీల్లో నాలుగేండ్లుగా అమ్మాయిలే గణనీయంగా చేరుతున్నారు. ఈ ఏడాది వీటిలో 69 వేల మంది ఇంటర్ ఫస్టియర్లో చేరితో అందులో 69 శాతం మంది బాలికలే ఉండటం విశేషం.
51% సీట్లు భర్తీ
సీపీగెట్ కౌన్సెలింగ్లో మొత్తం 51శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 వర్సిటీల పరిధిలో 293 పీజీ కాలేజీలుండగా, వీటిల్లో 45,201 సీట్లున్నాయి. మొదటి విడతలో 21,329 సీట్లు నిండగా, రెండో విడతలో మరో 1,809 సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 23,138 (51శాతం) సీట్లు నిండాయి. రెండో విడత కౌన్సెలింగ్కు 21,138 విద్యార్థులు హాజరుకాగా, అత్యధికులు గతంలో సీటు దక్కించుకొన్న వారే ఉండగా, కొత్తగా 1,809 విద్యార్థులకు సీట్లు వచ్చాయి. పీజీ ఫస్టియర్ తరగతులు అక్టోబర్ 10 నుంచే ప్రారంభమయ్యాయి. డిసెంబర్ చివరి వారంలో మొదటి ఇంటర్నల్స్ నిర్వహించనున్నారు.
డిగ్రీ, బీఈడీల్లోనూ సత్తా
డిగ్రీ, బీఈడీ ప్రవేశాల్లో ఈ ఏడాది అమ్మాయిలు సత్తాచాటారు. ఈ ఏడాది డిగ్రీలో 1.90 లక్షల సీట్లు నిండగా, 52 శాతం అమ్మాయిలు పైచేయి సాధించారు. బీఈడీ ఫస్టియర్లో 81 శాతం సీట్లను అమ్మాయిలే దక్కించుకొన్నారు. ఎడ్సెట్ కౌన్సెలింగ్లో 10,053 సీట్లను భర్తీ చేస్తే.. 8,158 సీట్లను అమ్మాయిలే దక్కించుకున్నారు. ఎడ్సెట్లో క్వాలిఫై అయిన వారిలో 82.5 శాతం మంది అమ్మాయిలే.
బాలికల విద్యలో దేశానికే దిక్సూచి
బాలికల విద్యలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. కొంతకాలంగా ఉన్నత విద్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటును మించి రాష్ట్ర అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నది. ఈ ఏడాది అమ్మాయిల కోసం కొత్తగా 53 గురుకుల డిగ్రీ కాలేజీలను సీఎం కేసీఆర్ మంజూరుచేశారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలు పెద్దసంఖ్యలో చేరుతున్నారు. 120 ఏండ్ల నిజాం కాలేజీ చరిత్రలో తొలిసారిగా డిగ్రీ ఫస్టియర్ అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించాం. ఉస్మానియాలో కొత్త హాస్టల్ నిర్మాణానికి ఈ నెల 19న శంకుస్థాపన చేశాం. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.18 కోట్లతో నిజాం కాలేజీలో కొత్త హాస్టల్ నిర్మాణం చేపడుతున్నాం.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
బాలికల అడ్మిషన్లే ఎక్కువ
విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి విద్యాబోధనను అందిస్తున్నాం. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నది. గతం కంటే ఈ ఏడాది బాలికల ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ ఏడాది అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధికంగా కళాశాలలో చేరారు.
– సీహెచ్ ఆరతి, ప్రిన్సిపాల్, తెలంగాణ యూనివర్సిటీ
మహిళా విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణ యూనివర్సిటీలో నాణ్యమైన బోధన లభిస్తున్నది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు టీయూను ఎంచుకోవడం సంతోషకరం. ప్రభుత్వం స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను నెలకొల్పి మహిళలకు ఉన్నత చదువులు అందించ డం ద్వారా విద్యార్థినులు ఉన్నత చదువుల్లో దూసుకెళ్తున్నారు.
– డాక్టర్ టీ సంపత్, హెచ్వోడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, టీయూ
ప్రత్యేక వసతుల కల్పన
రాష్ట్ర ప్రభుత్వం మహిళల చదువుపై శ్రద్ధ చూపుతున్నది. స్త్రీల కోసం గురుకుల కళాశాలలను ఏర్పాటు చేయడం అభినందనీయం. కేజీ టు పీజీలో భాగంగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేసి, సకల వసతులను కల్పించింది. విద్యార్థినులు అవకాశాలను అందిపుచ్చుకొని, కష్టపడి చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారు.
–బీ స్రవంతి, హెచ్వోడీ లా డిపార్ట్మెంట్, టీయూ
బాలికల విద్యకు పెద్దపీట
బాలికల చదువుకు ఆటంకాలూ కలుగకుండా ప్రభుత్వం కృషి చేస్తున్నది. పేదింటి బిడ్డలు చదువులో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే విద్యార్థినులు చదువులో ముందు వరుసలో ఉంటున్నారు. విద్యార్థినులకు వసతుల కల్పనలో విశ్వవిద్యాలయ అధికారులు సఫలీకృతమవుతున్నారు.
–యూ దివ్య, ఎల్ఎల్బీ, 3వ సంవత్సరం, టీయూ
అన్ని రంగాల్లో ముందుకు..
టీయూలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు మంచి ర్యాంకు లు సాధిస్తున్నారు. ఉన్నత కొలువుల్లో స్థిరపడుతున్నారు. నాణ్యమైన విద్యతోపాటు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. – డీ లావణ్య, మాస్ కమ్యూనికేషన్, టీయూ
వసతులు బాగున్నాయి..
విద్యలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉన్నది. విద్యారంగానికి కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకొని బాలుర కంటే బాలికలే విద్యను అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. నిరుడు కంటే 2022-23 నాటికి 56.46 శాతం బాలికలు కళాశాలలో జాయిన్ అయ్యారు. బాలికల విద్యకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వసతులను కల్పిస్తున్నారు.
– బిందు, మాస్ కమ్యూనికేషన్, ద్వితీయ సంవత్సరం
మహిళల ఉత్తీర్ణత మెరుగు..
కష్టపడి చదవడం వల్లే డిగ్రీ, పీజీ కోర్సుల్లో మహిళల ఉత్తీర్ణత శాతం పెరిగింది. బాలికలు ఉన్నత విద్య వైపు ఆసక్తి చూపుతున్నారు. అధ్యాపకులు చక్కని విద్యను అందించడం మూలంగానే ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతూ వస్తున్నది. నాణ్యమైన విద్యతో పాటు మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నారు.
– ఎం సుధారాణి, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ టీయూ