Sowmya Gudla | యాదగిరిగుట్ట, మే 27 : అమెరికాలోని ఫ్లోరిడాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లికి చెందిన ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. గుడ్ల కోటేశ్వర్రావు, బాలమణి దంపతుల కూతురు సౌమ్య (25) అమెరికాలోని ఫ్లోరిడాలోగల అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడే ఓ కన్సల్టెంట్ వద్ద శిక్షణ పొందుతున్నది.
విద్యార్థి వీసా కింద ఆరు నెలల క్రితం యాదగిరిగుట్టకు వచ్చి నెలరోజులపాటు ఇక్కడే ఉన్నది. ఈ నెల 11వ తేదీన 25వ పుట్టిన రోజు వేడుకలను ఫ్లోరిడాలోనే జరుపుకొన్నది. వచ్చే నెలలో ఇంటికి తిరిగి రావాలని భావించింది. ఇంతలోనే ఆదివారం రాత్రి ఫ్లోరిడా పట్టణంలో కూరగాయలు తీసుకునేందుకు బయటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డుపైకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.
తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సౌమ్య మృతదేహాన్ని వెంటనే తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని భారత రాయబారిని ఆమె తండ్రి కోటేశ్వర్రావు విజ్ఞప్తి చేశారు. యాదగిరిపల్లిలో చిన్న కిరాణా వ్యాపారం చేసుకుని జీవిస్తున్నామని, తమకు ఆస్తులు లేవని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కూతురి మృతదేహాన్ని తమకు అప్పగించాలని వేడుకున్నారు. కాగా సౌమ్య మృతి చెందడంతో యాదగిరిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.