హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ, గిరిజన మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ‘గిరి పోషణ’ కార్యక్రమంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఆదివాసీ, గిరిజనుల ఆహారపు అలవాట్లు, వారి ప్రాంతాల్లో పండే పంటలు, ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఉత్పత్తులకు అదనపు పౌష్టిక విలువలు జోడించి ఇవ్వటం వల్ల చిన్నారుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నదని కితాబు ఇచ్చింది.
పీవీటీ (పర్టిక్యులర్లీ వల్నరేబుల్ గ్రూప్స్) నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీ, గిరిజనులకు విస్తరించటంవల్ల చిన్నారుల్లో ఎదుగుదల స్పష్టంగా కనిపించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, 3-6 ఏండ్ల మధ్య ఉన్న చిన్నారులు రక్తహీనతతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని జాతీయ కుటుంబ సర్వేసహా పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అటవీ, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
గిరిజన సంక్షేమశాఖ ఇక్రిశాట్ ఆధ్వర్యంలో ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 12 మండలాల్లో తొలి దశలో 7,501 మందికి, మలిదశలో 5,597 మందికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీని ప్రారంభించింది. ఆర్నెళ్లపాటు పంపిణీ చేసిన తర్వాత రెండో దశలో ప్రారంభానికి ముందున్న రక్తహీనత, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, జబ్బచుట్టు కొలతవంటి అంశాలపై శాస్త్రీయంగా పరిశోధించారు. గర్భిణులు, బాలింతలతోపాటు ఏడు నెలల నుంచి 5 ఏండ్ల చిన్నారుల్లో పోషక విలువల స్థాయి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. తెలంగాణ, చండీగఢ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో తృణధాన్యాలతోకూడిన పౌష్టికాహార పంపిణీ ప్రారంభిస్తే.. కేవలం తెలంగాణలోనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
తెలంగాణ సాధించిన ఫలితాలు
ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే తెలంగాణ సర్కారు లక్ష్యం. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే అటవీ, మైదాన ప్రాంతాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో ఆరోగ్య సమస్య ఉందని గుర్తించాం. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. మిల్లెట్ ఉత్పత్తులను పౌష్టికాహారంతో జోడించి అందివ్వటం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దీన్ని నీతి ఆయోగ్ గుర్తించటం సంతోషకరం. భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ముందే గుర్తించాలన్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతున్నది.
-సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి