ఢిల్లీ, జూలై 10(నమస్తే తెలంగాణ): దేశంలో ఉన్నత విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. జాతీయంగా తెలంగాణ రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) అత్యధికంగా ఉన్నదని తెలిపారు. విద్యారంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఐఈపీఏ)కు నూతన వీసీగా నియమితులైన శశికళ వంజరిని ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వీసీ దండెబోయిన రవీందర్యాదవ్ కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంచికను ఆమెకు అందజేశారు. అనంతరం ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు శశికళ వంజరితో సమావేశమయ్యారు. భవిష్యత్తులో నీపా, వర్సిటీల సమన్వయంతో సదస్సులు, వర్క్షాప్లు నిర్వహించి, ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించినట్టు లింబాద్రి తెలిపారు. సమావేశంలో ఎన్ఐఈపీఏ ప్రొఫెసర్ సుధాన్స్ భూషణ్, ఉన్నత విద్య ప్రధాన అధికారి ప్రదీప్ మిత్ర, ప్రొఫెసర్ గరిక మాలిక్ తదితరులు పాల్గొన్నారు.