Auto Drivers | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉపాధి కోల్పోయామని ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అన్ని వర్గాలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వీరి మరణాలకు కారణమైందా? కేవలం 40 రోజుల్లోనే 9 మంది ఆటోడ్రైవర్ల ఉసురు పోసుకొన్నదా? అంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ అవుననే సమాధానం ఇస్తున్నది. ఈ పోస్టును రీపోస్ట్ చేస్తున్న నెటిజన్లు.. వీళ్ల చావులకు బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
అప్పులు కట్టలేక, ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక మృత్యువాతపడుతున్నారని అంటున్నారు. మరోవైపు చర్చల పేరిట ఆటోడ్రైవర్లు, యూనియన్ నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటిస్తున్నా.. ఆత్మైస్థెర్యాన్ని మాత్రం నింపలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం తమ కుటుంబాలను రోడ్డున పడేసిందని ఆటోడ్రైవర్లు నెత్తి, నోరు బాదుకుంటున్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవటంపై నెటిజన్లు సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీరి మరణాలకు కాంగ్రెస్ సర్కారే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం తెలంగాణవ్యాప్తంగా 40 రోజులలో 9 మంది ఆటోడ్రైవర్లు మృత్యువాతపడ్డారు. సైఫాబాద్ పీఎస్ పరిధిలోని మక్తాకు చెందిన హమీద్(29) ఆటోడ్రైవర్ మరణించగా ఈ నెల 18న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జనవరి 5న బీఎస్ మక్తాకు చెందిన సతీశ్గౌడ్ ఉరేసుకున్నాడు.
మెదక్ జిల్లాలోని హవేళిఘణాపూర్ మండలం కూచన్పెల్లికి చెందిన నర్సింహాగౌడ్ ఆటో గిరాకీ లేకపోవడంతో, తీసుకున్న అప్పులు తీర్చలేక చనిపోయాడు. స్టేషన్ ఘన్పూర్లోని మీదికొండకు చెందిన వేముల సత్యనారాయణ గిరాకీ లేదని తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 13న గుండెపోటుతో మరణించాడని ఆటో యూనియన్లు వెల్లడించాయి. ఈ నెల 16న భయ్యాలాల్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ అనిల్కుమార్ (26) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
18న ఇల్లందుకు చెందిన అక్బర్(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు చేసి ఆటో కొన్న రాహుల్ అనే ఆటోడ్రైవర్ ఈ నెల 19న బండ్లగూడ జాగీర్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగర్కర్నూల్ జిల్లా గగ్గలపల్లికి చెందిన ఎస్కే గులాం (44) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలకు సంబంధించిన ఆధారాలతో వార్తా క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భరోసా ఇవ్వని మంత్రి మాటలు
హైదరాబాద్ జిల్లా ఇంచార్జీగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆటోడ్రైవర్లకు అండగా ఉంటామని ప్రకటించినా, ఆయన మాటలు, ప్రభు త్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆటోడ్రైవర్లు మరణిస్తున్నా చర్చల పేరిట, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.