తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వం దేశం ఘనమైన చరిత్ర, సంస్కృతి, సాధించిన విజయాలను వేడుకల రూపంలో ప్రదర్శిస్తోంది.
ఈ సందర్భంగా 2 జూన్, 2022న సాయంత్రం 6:30 గంటల నుంచి న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి చైర్మన్గా ఉన్న నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదంతో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత గాయనీ, గాయకులు మంగ్లీ, హేమచంద్ర తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద హర్యానా రాష్ట్ర పాఠశాల పిల్లల ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యకారులు రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వైభవాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.