తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర పరిస్థితులను పేదలు అనుభవించేవారు. ఇక్కడ రోజూ ఆకలి చావులే. తెలంగాణ ఏర్పడే నాటికి ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, కనీస జీవన భద్రత కల్పించాలని ఏడేండ్ల క్రితమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.45 వేల కోట్లతో పలురకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం స్థాపించింది.
నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధత్యగా భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 39,07,818 మందికి ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నది.
ఇందులో రాష్ట్రంలోని 13,41,380 మంది వృద్ధులు, 13,91,041 మంది వితంతువులు, 35,527 మంది నేత కార్మికులు, 59,920 మంది గీత కార్మికులు, 32,185 మంది ఎయిడ్స్ పేషంట్లు, 4,17,757 మంది బీడీ కార్మికులు, 1,19,640 మంది ఒంటరి మహిళలు, 16,131 మంది బోదకాలు బాధితులకు రూ.2016 చొప్పున, 4,76,864 మంది వికలాంగులకు, 43,504 మంది వృద్ధ కళాకారులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తున్నది. వీరందరి పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా 10,266 కోట్లు ఖర్చు చేస్తున్నది.
రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.దీంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు కళ్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టి, రూ.1,00,016 చొప్పున అందజేస్తున్నది. ఇందులో షాదీ ముబారక్ పథకం ద్వారా 2,04,915 మందికి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 4,14,526 మందికి 6,19,441 మందికి ఈ పథకాలను అందజేశారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5556 కోట్లు ఖర్చు చేసింది.
రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఆకలికి అలమటించవద్దని, కనీస ఆహార భద్రత ఉండాలని ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను పెంచింది. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 17,010 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,93,000 కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి సంవత్సరానికి 1,78,754 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
2013-14 ఆర్థిక సంవత్సరం : ఒక్కో వ్యక్తికి 4 కిలోలు (కుటుంబానికి 20 కిలోలు)
2021-22 ఆర్థిక సంవత్సరం : ఒక్కో వ్యక్తికి 6 కిలోలు (పరిమితి లేదు)
(పెరుగుదల 2 కిలోలు, పెరిగిన శాతం 50)
2013-14 ఆర్థిక సంవత్సరం : 1,32,464 టన్నుల బియ్యం పంపిణీ
2021-22 ఆర్థిక సంవత్సరం : 1,78,754 టన్నుల బియ్యం పంపిణీ
(పెరుగుదల 46,290 టన్నులు, పెరిగిన శాతం 34.94)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ పోర్టబిలిటీ (తెల్ల కార్డు ఉన్న లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే విధానం) స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ‘‘ఒకే దేశం – ఒకే కార్డు’’ పథకం ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుకునే విద్యార్థులందరికీ సన్నబియ్యంతో వండిన అన్నమే పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెలా 12 వేల మెట్రిక్టన్నుల సన్న బియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా సరఫరా చేస్తున్నది. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,300లకు కొనుగోలు చేసి, 44,61,000 మంది విద్యార్థులకు ఈ బియ్యాన్ని అందజేస్తున్నది.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్ వాడీలకు 2019 ఫిబ్రవరి 1 నుంచి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఈ-పాస్ విధానంలో అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో దీన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా అంగన్ వాడీ కేంద్రాలకు కావాల్సిన బియ్యం నెల మొదటివారంలో అందడంతోపాటు, దుర్వినియోగం కాకుండా ఉంటుంది. రాష్ట్రంలోని 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల (గ్రామీణ – 99, పట్టణ – 25, గిరిజన ప్రాంతాల – 25) పరిధిలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 22,28,250 మంది లబ్ధి దారులకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం బియ్యాన్ని అందిస్తున్నది.
➤ ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాను సమర్థవంతంగా అరికట్టింది. 1061 మంది గుడుంబా బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసింది.