హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కోరారు. తెలంగాణ ప్రజల కల సాకారమైన తీరును యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతోమంది అమరుల త్యాగాలను తెలంగాణ వాదులందరూ స్మరించుకోవాలని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు. ఒకప్పుడు వివక్షకు, అణచివేతకు గురైన తెలంగాణ.. నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. ఇది… ప్రతీ తెలంగాణ వ్యక్తి గర్వించదగిన విషయమని మహేశ్ బిగాల చెప్పారు.
ఫుల్ డ్రెస్ రిహార్సల్ పరిశీలన
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2న నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించే వేడుకల పూర్తి డ్రెస్ రిహార్సల్ను సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ పబ్లిక్గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ముందుగా గన్పార్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాక, పబ్లిక్ గార్డెన్ చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సీఎస్ తెలిపారు. సీఎస్ వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్ తదితరులు ఉన్నారు.
2న కోర్టుల్లో రాష్ట్రావతరణ వేడుకలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న రాష్ట్రంలోని అన్ని కోర్టుల ఆవరణలో జాతీయ జెండా ఎగురవేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సుజన పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
సీపీఐ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఈ నెల 2న సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. విభజన చట్టంలోని హామీల సాధనకు కలిసివచ్చే రాజకీయపార్టీలతో ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.