హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివేకానంద విదేశీ విద్యాపథకంతోనే ఇది సాధ్యమైంది. ఇప్పటివరకు 617 మంది పేద విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. మరో 295 మందికి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. పేద బ్రాహ్మణుల విద్యాభివృద్ధికి చేయుతనిచ్చే ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు.
చదువులో మంచి మార్కులు సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా గతంలో ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఇతర అణగారిన కులాలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను పేద బ్రాహ్మణులకూ వర్తించేలా చర్యలు చేపట్టారు. ఇం దులో ప్రధానమైనది వివేకానంద విదేశీ విద్యాపథకం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం.. విదేశాల్లో ఉన్నతవిద్య పగటి కలగా భావించే ఎం దరికో వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులు.. ప్రధానంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా తదితర దేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు 617 మంది లబ్ధి పొందడమే కాకుండా విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఏడంకెల వేతనాలను అందుకుంటున్నారు.
త్వరలో 295 మందికి ఇంటర్యూ
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్ర స్తుత విద్యాసంవత్సరానికిగాను లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటర్యూలను చేపట్టింది. 295 మంది వివేకానంద విదేశీ విద్యాపథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల్లో ఇంటర్యూల ప్రక్రియ పూర్తిచేస్తామని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
విదేశీ విద్యాపథకానికి అర్హతలు
ఈ పథకం వల్ల స్థిరపడ్డాను
మాది పేద కుటుం బం. వివేకానంద విదే శీ విద్యాపథకం ద్వా రా ప్రభుత్వం ఉ న్నత విద్యకు రూ. 19,91,796 సహా యం అందించింది. జర్మనీలోని స్టట్గార్ట్ వర్సిటీలో చదువుకున్న. ఐటీలో పీజీ చేయగానే, బెర్లిన్లో బిగ్ డాటా కన్సల్టెంట్గా ఉద్యోగం వచ్చింది. రూ.60 లక్షల వార్షిక వేతనం. ఈ పథకమే లేకుంటే నేను విదేశీ విద్య గురించి ఆలోచించేవాడినే కాదు. ప్రభుత్వం అందించిన చేయూతతో ప్రస్తుతం జీవితంలో స్థిరపడ్డాను. సీఎం కేసీఆర్కు సదా కృతజ్ఞుడిని.
– వేల్పూరు శ్రీకశ్యప్ (హైదరాబాద్)
ప్రభుత్వ సహాయం వెలకట్టలేనిది
సమయానికి తెలంగాణ ప్రభుత్వం నాకు వెలకట్టలేని స హాయం అందించింది. లేకుంటే ఇంతమంచి ఉద్యోగంలో ఉండేదాన్నే కాదు. రూ.20 లక్షల విదేశీవిద్యా స్కాలర్షిప్తో ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం సిడ్నీలో ఫ్రైట్ ఫార్వర్డింగ్ కంపెనీలో కోఆర్డినేటర్గా రూ.25 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేస్తు న్నా. ఈ పథకంతో నాలాంటి ఎందరో పేదలు విదేశీ విద్యను అందుకోగలిగారు.
– బొమ్మకంటి కీర్తి చక్రవర్తి, సికింద్రాబాద్
సాయం లేకుంటే కలగానే మిగిలేది
కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) చేశాను. ఇక్కడే సెరెన్స్ సంస్థలో రీసెర్చ్ సైంటిస్ట్గా ఉద్యోగం వచ్చింది. ఏడంకెల వేతనం పొందుతున్నాను. చిన్నప్పటినుంచి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక సమస్యల వల్ల అది సాధ్యంకాదని అనుకునేదాన్ని. కానీ, తెలంగాణ ప్రభుత్వం నా కలలను నిజం చేసింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– చెరుకుపల్లి రాజశ్రీ కులకర్ణి
(హైదరాబాద్)
ప్రభుత్వ చేయూతతోనే జాబ్
యూకేలోని నార్త్అంబ్రియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ (కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్) కోర్సు పూర్తిచేశాను. లండన్లోని వన్హబ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా రూ.80 లక్షల వార్షిక వేతనంపై పనిచేస్తున్నాను. మా ఆర్థిక స్థితి దృష్ట్యా విదేశీవిద్య ఊహకు కూడా అందనిది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీవిద్యా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.
– ఆవునూరి సౌమిత్ కుమార్, (సికింద్రాబాద్)