హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీల ద్వారా పిల్లలకు అందించే బాలామృతాన్ని మరింత నాణ్యతగా తయారుచేసేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. రెండు రోజుల అహ్మదాబాద్, ఇండోర్ పర్యటనలో భాగంగా మొదటి రోజు శుక్రవారం ఆయన గుజరాత్ రాష్ట్రం కైరా జిల్లా ఆనంద్లోని అమూల్ టెక్ హోం రేషన్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడె రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. అమూల్ ఫ్యాక్టరీ యంత్రాలు, సాంకేతికత అధునాతనమైనవని తెలిపారు.
ఇప్పటికే ఆసియాలో అతిపెద్ద ప్లాంట్ ద్వారా బాలామృతం ఉత్పత్తి చేస్తున్నామని, అమూల్ రోస్టర్లు వినియోగించి మరింత నాణ్యమైన పౌష్టికాహారం ఉత్పత్తి చేయవచ్చని, వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. గుజరాత్లో బాలామృతం తయారీకి రూ.75 ఖర్చు అవుతుంటే మనకు 50 రూపాయలే ఖర్చవుతుందని చెప్పారు. ఈ పర్యటనలో జీఎం విజయలక్ష్మి, ఏజీఎంలు శ్రీనివాస్ నాయక్, ఎలమంద ఉన్నారు.