Kaloji award | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆయన కదిలే పాటల ప్రవాహం. ఆ పాటలు నిప్పు కణికలై జ్వలిస్తుంటాయి. అంతలోనే కన్నీళ్లు పెట్టిస్తాయి. ‘నిన్నెట్ట మర్చిపోదును చేరాల..’ పాట ఆయన గళం నుంచి పొంగుకొచ్చిన తొలి పల్లవి. అది మొదలు ఆయన మాట పల్లవై పరవశించింది. ప్రజా గాయకుడిని చేసింది. ‘ఎక్కడ ఉన్నారో అన్నలు.. యాడా ఉన్నారో..’ అంటూ కన్నీళ్లు పెట్టించే పాటతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. వానమ్మ పాట కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోనా కష్టజీవికి తోడుగా నిలిచింది. ఆయన టచ్ చేయని రంగమే లేదు. పాట ఏదైనా మనసును హత్తుకుంటుంది. అందుకే జయరాజ్ పాటలు అక్షర దీపాలై ఇంకా వెలుగుతూనే ఉన్నాయి.
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది అవార్డు అందిస్తుంటుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. జయరాజ్ను ఎంపిక చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజ్కు ‘కాళోజీ’ అవార్డు అందిస్తారు. అవార్డు కింద రూ. 1,01,116 నగదు రివార్డు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు.
కష్టాలను అధిగమించిన కవి
మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ (60) చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళితకుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షలేని సమాజం కోసం కృషి చేశారు. బుద్ధుడి బోధనల ప్రభావం ఆయనపై చాలానే ఉంది. అంబేదర్ రచనలతో స్ఫూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరుగుతూ తన ఆటపాటలత ద్వారా ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు.