హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్లైన్లో ఆడిట్చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. హిమాచల్ ప్రదేశ్ (236), రాజస్థాన్ (144), కర్ణాటక (106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 10 రాష్ర్టాలు మాత్రమే ఆన్లైన్ ఆడిటింగ్ను ప్రారంభిచాయి. మిగతా రాష్ర్టాలు ఇంకా మొదలు పెట్టలేదు. దేశంలో మొత్తం 2,55,236 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 4,684 గ్రామాల ఆడిటింగ్ పూర్తయింది. ఇందులో 78 శాతం తెలంగాణవే కావడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఎలా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ఆడిటింగ్ వీలుకల్పిస్తున్నది.
మొదటి నుంచే అగ్రస్థానంలో తెలంగాణ
అన్ని గ్రామాలను ఆన్లైన్ ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. రాష్ట్రంలో 5,174 పంచాయతీలను ఆన్లైన్లో ఆడిట్ చేసి 56,505 అభ్యంతరాలను పంచాయతీలకు పంపారు. తద్వారా దేశంలో మొదటి స్థానంలో నిలిచారు. వాస్తవానికి గతేడాది 25 శాతం గ్రామాలనే ఆడిట్ చేయాలని కేంద్రం సూచించింది. తెలంగాణ అధికారులు దాదాపు 40 శాతం గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తిచేశారు. దీంతో అనేక రాష్ర్టాలు తెలంగాణకు వచ్చి ఆన్లైన్ ఆడిటింగ్ విధానంపై అధ్యయనం చేశాయి. కొన్ని రాష్ర్టాలు కనీసం ఆడిటింగ్ను కూడా మొదలు పెట్టకపోవడంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గతేడాది అన్ని రాష్ర్టాల ఆడిట్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. మోదీ సర్కార్ విన్నపం మేరకు తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది సైతం తెలంగాణ అధికారులు జూన్ నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేశారు. ఫలితంగా దేశంలోని అన్ని రాష్ర్టాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు.