Telangana | సంగారెడ్డి, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులు ఏకమవుతున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కటై ముఠా కట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులు, నికార్సయిన తెలంగాణ బిడ్డ కేసీఆర్ మధ్యే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణ గెలవాలంటే కేసీఆర్ కారుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా కాంగ్రెస్, బీజేపీలోని రాంగ్ లీడర్లు మనకెందుకని ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎం కాకుంటే అభివృద్ధిలో తెలంగాణ 20 ఏండ్లు వెనక్కి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సంగారెడ్డి, జహీరాబాద్లో శుక్రవారం పర్యటించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్, జహీరాబాద్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాలకు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కు తెలంగాణ రావడం ఇష్టం లేదని, తెలంగాణ ప్రకటించినప్పుడు భోజనం మానేశానని చెప్పాడని గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన పవన్ బీజేపీతో జతకట్టారని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న షర్మిల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్కు ఓటేయాలని చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు లోపాయికారీగా కాంగ్రెస్కు సహకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణను దెబ్బతీసేందుకు, తెలంగాణను ఆగం చేసేందుకు తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో బయలుదేరినట్టు ఆరోపించారు. ఎన్నికల్లో కిందమీద అయితే తెలంగాణ ఆగం అవుతుందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని, కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
రేవంత్ బెయిలుపై ఉన్న ఖైదీ
పీసీసీ అధ్యక్షుడు బెయిలుపై ఉన్న ఖైదీ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ఉస్మానియా విద్యార్థులను రేవంత్రెడ్డి అవమానించారని, ఉస్మానియా విద్యార్థులు బీర్లు, బిర్యానీలకు అమ్ముడుపోతారని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలిపారు. ఎన్నికల్లో అవి రెండూ పరస్పరం సహకరించుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.
ఈ విషయాన్ని ముస్లింలు గమనించాలి
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైన విషయాన్ని ముస్లింలు గమనించాలని, బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావన్నారు. కేసీఆర్ సిసలైన సెక్యులర్ నేత అని, తెలంగాణలో తొమ్మిదేండ్లలో ఒక్క కర్ఫ్యూ కూడా లేదని గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీ బీబీపాటిల్, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, నరోత్తం, తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు పట్నం మాణిక్యం, దేవీప్రసాద్, మామిళ్ల రాజేందర్, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ను నమ్మితే రిస్కు తప్పదు
కాంగ్రెస్ను నమ్మితే రిస్కు తప్పదని ప్రజలను మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఓటువేసి హ్యాట్రిక్ సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా రేవంత్రెడ్డి క్రిమినల్ గ్యాంగ్ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. తెలంగాణ గెలవాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసి అక్కడి ప్రజలు మోసపోయారని, ఐదు గంటల కరెంటుతో బతుకులు ఆగమయ్యాయని స్వయంగా రైతులే చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా కాంగ్రెస్లోని రాంగ్ లీడర్లు మనకెందుకని ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి ఆగం కావొద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ప్రజల్లో బలం లేనోడు, పనికిరానివాళ్లు మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను, అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
టీకాంగ్రెస్ను డీకే బొందపెట్టిండు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో ప్రచారం చేసి కాంగ్రెస్ను బొందపెట్టారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చిన శివకుమార్ తాండూరు సభలో మాట్లాడుతూ.. కర్ణాటకలో తాము ఐదు గంటల కరెంటు ఇస్తున్నట్టు చెప్పి టీకాంగ్రెస్ను హిట్వికెట్ చేశారని పేర్కొన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తే ఖర్గే బహిరంగ సభకు మించి జనం వచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక జగ్గారెడ్డి ఏనాడూ నియోజకవర్గంలో పర్యటించలేదని, ఓటర్లు ఆయనను నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు పనికిరాని జగ్గారెడ్డిని ఓడించి, చింతా ప్రభాకర్ను గెలిపించాలని కోరారు.
ఓటుకు నోటుకేసులో పట్టపగలే దొరికిన దొంగ రేవంత్. చర్లపల్లిలో ఖైదీ నంబరు 4170గా, చంచల్గూడలో ఖైదీ నంబర్ 1179గా గడిపాడు. కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే టికెట్లను రేవంత్ అమ్ముకుంటున్నాడని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తెలంగాణ వద్దన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాలకు, సమైక్యవాదులకు రేవంత్ ఊడిగం చేస్తున్నడు.
-మంత్రి హరీశ్రావు