హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నీలగిరి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామడుగు మనోహర్, రాష్ట్ర కోశాధికారిగా సిద్ధి నాగరాజును రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
అనంతరం నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు, డీలర్ల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా కృషిచేస్తానని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన డీలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్రెడ్డి, మల్లేశం, జలంధర్, సత్యనారాయణరెడ్డి, కేదారి, నాగరాజు, రాజేందర్రెడ్డి, రామచంద్రారెడ్డి, రామబ్రహ్మం, నాగేశ్వరరావు, నాగేందర్, మునాఫ్ పాల్గొన్నారు.