కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు.
సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వానాకాలం సాగుకు సంబంధించిన రెండు జిల్లాల వర్క్షాప్ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో తెలంగాణను మించిన మొనగాడు లేడని, ఎవరైనా ఉన్నట్లు చూపితే తాము అనుసరిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ అనాలసిస్, రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో పండుతున్న పంటలను విశ్లేషించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఆ తర్వాత సీజన్కు సిఫారసు చేస్తుందన్నారు. ఈ సంస్థలను అనుసరించి రైతులు పంటలు సాగు చేస్తే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందన్నారు.
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్ ఫాం, నూనె గింజల పంటలకు డిమాండ్ ఎక్కువ ఉందని, ఈ పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని రైతులకు వివరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉన్నారని, ఆయనకు ఏ ఒక్క విషయంపైనా అవగాహన లేదని విమర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ గాంధి హన్మంతు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మ్మెల్యే రసమయి బాలకిషన్, నాబ్స్కాప్ చైర్మన్ కొండూర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.