హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రైతులకు రుణ మార్పిడి రుణాలు ఇవ్వని బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు హెచ్చరించారు. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం రైతులకు రుణ మార్పిడి రుణాల సమాచారాన్ని తెలియజేయాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉన్నప్పటికీ ఆ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నాయని విమర్శించారు.
బ్యాంకుల నిర్లక్ష్యం, మోసపూరిత విధానాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకొని ఆ భారాన్ని మోయలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతులకు తొలి ప్రాధాన్యంగా రుణమార్పిడి రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ సూచించిందని శ్రీహరిరావు గుర్తుచేశారు. ఈ సూచనను తెలంగాణలోని ఒక్క బ్యాంక్ కూడా పాటించడంలేదని తెలిపారు.