Free Power for Agriculture | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు ఉద్యమించనున్నారు. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాలను గ్రామాల్లోని రైతు వేదికల సాక్షిగా నిలదీయనున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ‘రైతు సమావేశాలు’ నిర్వహించనున్నారు. ‘మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పనున్నారు.
ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నిర్వహణ బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోనున్నారు. ఎకరానికి గంట కరెంటు సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమేనని, కాంగ్రెస్ వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయాలని మంత్రి కేటీఆర్ ఇటీవల టెలికాన్ఫరెన్స్లో సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ కాదని, తెలుగు కాంగ్రెస్ అని, చంద్రబాబు కాంగ్రెస్ అని రైతు సమావేశాల్లో ప్రజలకు వివరించనున్నారు. ‘కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాలి’ అని విజ్ఞప్తి చేయనున్నారు.