Telangana | కాంగ్రెస్ హయాంలో రైతులు ఆరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక, సరిపడ సాగునీరు, విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు గంటల కరెంట్ కోసం అర్ధరాత్రి బావుల వద్దకు పోతే కరెంట్ షాకులు, పాములు, తేళ్ల కాట్లతో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అలా చాలా మంది రైతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ విషాదఛాయలు ఇప్పటికీ ఆ కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ కేసీఆర్ సర్కార్లో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం, రైతుబంధు పెట్టుబడి ఇవ్వడం, సాగునీరు ఇవ్వడంతో రైతులు రాజులు అయ్యారు. కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని రైతులు కోడై కూస్తున్నారు.
అయితే కరెంట్ కష్టాల కారణంగానే మా నాన్న చనిపోయాడని ఓ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం లాంటి మా నాన్నను కాంగ్రెస్సే పొట్టన పెట్టుకుందని కన్నీరు పెట్టుకుంది ఆమె. నా లాంటి గతి మరొకరికి రావొద్దంటే.. కేసీఆర్ పాలనకే జై కొట్టాలని ఆమె కోరింది. ఆ బిడ్డతో పాటు ఆమె తల్లి కూడా కేసీఆర్కే ఓటేయాలని పిలుపునిచ్చింది.
మాది దామరచర్ల, నల్లగొండ జిల్లా. కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కష్టాలు బాగుండే. అర్ధరాత్రి పూట కరెంట్ వస్తే నీళ్లు వేద్దామని మా ఆయన శేషిరెడ్డి బావికాడికి పోయిండు. అప్పటికీ కరెంట్ లేదు. మోటారు సర్దుతుంటే కరెంట్ సడెన్గా వచ్చింది. దాంతో మా ఆయన ప్రాణాలు పోయాయి. తెల్లారి పొద్దున్నే మేం చూశాం. కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతోనే ప్రాణాలు పోయాయి. ఆ మూడు గంటల కరెంట్తో సరిగ్గ పొలాలు పారకపోయేది.
ఇప్పుడు కరెంట్ మంచిగా ఉంది. బాగానే పొలాలు పారుతున్నాయి. మేం కూడా కూలీ పోతున్నాం. అప్పుడు 2, 3 గంటలు కరెంట్ ఇస్తే పారలేదు. ఇప్పుడు మిగులు కూడా ఉంటుంంది. నీళ్లు వస్తున్నాయి. రైతుబంధు వేస్తుండు. అప్పుడు ఎవరూ చూడలేదు. రూపాయి ఇచ్చినోడు లేడు. బాగానే చేస్తుండు కేసీఆర్. అప్పుడు ఇట్ల ఉంటే ఎందుకు ఇన్ని తిప్పలు పడేవాళ్లం. కేసీఆర్ మాకు కల్యాణలక్ష్మి, 2 వేలు పెన్షన్, రైతుబంధు ఇచ్చిండు. మా పిల్లలకు మంచిగా ఉంది. మా కేసీఆర్కు మళ్లా ఓటేస్తాం. 3 గంటలు ఇస్తే ఎట్ల పారుతది. ఆ మూడు గంటల కరెంట్ వల్లే నా భర్త చనిపోయిండు. మళ్లీ ఎంతమందిని చావగొడుతారు. పిల్లలను ఎవరు సాకుతారు అని శేషిరెడ్డి భార్య తన ఆవేదనను వెలిబుచ్చింది.
నాకు మూడేండ్ల అప్పుడు మా నాన్న చనిపోయిండు. అర్ధరాత్రి ఒంటి గంటకు సడెన్గా కరెంట్ వచ్చి చనిపోయిండు. చాలా సంతోషంగా ఉండేవాళ్లం. రేవంత్ రెడ్డి గెలిస్తే మళ్లీ నా లాంటి ఆడపిల్లలు బాధపడుతారు. మళ్ల అలాంటి కాలం రావొద్దు. కేసీఆర్ పాలన బాగుంది ఆయనే కావాలి. కల్యాణలక్ష్మి, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, స్కాలర్షిప్లు అందుతున్నాయి. మళ్లీ కేసీఆర్ను గెలిపించుకోవాలి. మా నాన్న ఉండి ఉంటే మేం సంతోషంగా ఉండేవాళ్లం. మూడు గటల కరెంట్ వద్దు. తండ్రులను కోల్పోయి మా లాంటి ఆడపిల్లలు బాధ పడకూడదు. ఇతరుల మీద ఆధారపడితే వారు విసుక్కోవడం వంటివి చూస్తున్నాం. మా నాన్న బతికి ఉంటే బంగారంలాగా చూసుకునేవారు. 24 గంటల కరెంట్తో సంతోషంగా ఉండగలుగుతున్నాం అని శేషిరెడ్డి కూతురు తెలిపింది.