దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షల గడువును ఈ నెల 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది. కరోనా ఉధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వీటి ప్రకారం, రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగులతోపాటు ప్రజలు గుంపులుగా చేరడం(మాస్ గ్యాదరింగుల)పై నిషేధం విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మతపర, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై కూడా నిషేధం విధించింది.
ఈ నిర్ణయం ప్రకారం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, షాపులు, మాల్స్, తదితర సంస్థలు కూడా మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతోపాటు సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆంక్షలను 20వ తేదీ వరకూ పొడిగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.