దొంగ పనులు చేస్తే మూసేస్తాం
నిబంధనలను పాటించే పబ్లే నడుస్తాయ్
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టీకరణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఏప్రిల్ 5 : రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ర్యాడిసన్ బ్లూ హోటల్లో పార్టీకి వందల మంది వచ్చారని, వారంతా డ్రగ్స్ వినియోగించినట్టు భావించడంలేదని చెప్పారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయో ఆరా తీస్తామని, పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చాకే నిందితుల పేర్లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదలబోమని, అసలైన దోషులను గుర్తించి చట్టప్రకారం విచారిస్తామని తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై నిజమైన సమాచారాన్ని అందజేసేవారికి నగదు పారితోషికం ఇస్తామని, మీడియాను వెంట తీసుకెళ్లి మరీ దాడులు చేస్తామని చెప్పారు. విపక్షాలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. డ్రగ్స్ను అరికట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం, అధికారులపై అనవసర విమర్శలు చేయొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఆ పబ్ నిర్వాహకుడు రేణుకా చౌదరి అల్లుడే
ర్యాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్తో తన కుమార్తె తేజస్వినీ చౌదరికి, అల్లుడు పెన్మెత్స కిరణ్రాజుకు సంబంధం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి చెప్పిన మాటలన్నీ అబద్ధమేనని తేలిపోయింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనిల్ కుమార్, అభిషేక్ ఉప్పల అనే నిందితులను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. కేసు దర్యాప్తు వేగాన్ని మరింత పెంచారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పుడ్డింగ్ అండ్ మింక్ హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరిట 2017లో ఈ పబ్ ఏర్పాటైనప్పటి నుంచి తేజస్వని చౌదరి డైరెక్టర్గా కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఆయుర్వేదిక్ కాక్టెయిల్స్కు కేరాఫ్ అడ్రస్గా ఈ పబ్ను ప్రమోట్ చేసిన తేజస్వినీ చౌదరి పేరు ఇప్పటికీ ఆర్వోసీ రికార్డుల్లో ఉన్నట్టు స్పష్టమైంది. ఆమె భర్త కిరణ్రాజు కూడా ఇదే సంస్థలో డైరెక్టర్గా కొనసాగుతున్నట్టు తేలింది.
ర్యాడిసన్ హోటల్లో మొదటి ఫ్లోర్ను లీజుకు తీసుకొన్న కిరణ్రాజు.. గత ఏడాది ఆగస్టు వరకు ఈ పబ్ను నడిపినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఈ పబ్ను అర్జున్ వీరమాచినేని, ఉప్పల అభిషేక్ అనే వ్యక్తులకు సబ్ లీజుకు ఇచ్చిన కిరణ్రాజు.. ఇప్పటికీ అధికారిక రికార్డుల్లో కొనసాగుతుండటంతో పోలీసులు ఆయనను కూడా నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన పబ్ మేనేజర్ అనిల్ కుమార్.. చాలాకాలం నుంచి అక్కడే పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రముఖుల పిల్లల కోసం అనిల్ కుమార్తో కలిసి అభిషేక్ ఉప్పల ‘ఆఫ్టర్ పార్టీ’ పేరిట రాత్రి 12 తర్వాత కూడా పార్టీలు నిర్వహిస్తున్నట్టు తేల్చారు. ఈ పబ్ నిర్వాహకుల్లో ఒకరైన అర్జున్ వీరమాచినేని.. నందమూరి కుటుంబానికి అల్లుడని తేలింది. సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరి కుమార్తెను అర్జున్ పెళ్లిచేసుకొన్నట్టు తెలుస్తున్నది. అతనితోపాటు రేణుకా చౌదరి అల్లుడు కిరణ్రాజు కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
లీటర్ హాష్ ఆయిల్పై 7 లక్షల రాబడి
గంజాయి, హాష్ ఆయిల్ విక్రయాల్లో ఆరితేరిన లక్ష్మీపతి గత ఏడేండ్లుగా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఏపీలోని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి అతను ఈ దందా నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. అక్కడ లీటర్ హాష్ ఆయిల్ను రూ.లక్షకు కొని.. హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.8 లక్షలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ప్రతి లీటర్ హాష్ ఆయిల్పై భారీగా రూ.7 లక్షల ఆదాయం లభిస్తుండటంతో లక్ష్మీపతి ఈ దందాను మానుకోవటంలేదు. ఇప్పటికే మూడుసార్లు అరెస్టయినా హాష్ ఆయిల్ అమ్మకాలను కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ బీటెక్ విద్యార్థి మృతికి కారణమైన డ్రగ్స్ సరఫరాదారు ప్రేమ్ ఉపాధ్యాయ్ను పోలీసులు విచారించడంతో లక్ష్మీపతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కోసం ఆ విద్యార్థి.. లక్ష్మీపతి, ప్రేమ్ ఉపాధ్యాయ్తో కలిసి పలుమార్లు గోవాకు వెళ్లినట్టు విచారణలో తేలడంతో లక్ష్మీపతి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.