హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద్వారా లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు. అన్ని దుకాణాలకు కలిపి గురువారం వరకు 66,452 దరఖాస్తులు అందాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.1,329 కోట్లు వచ్చినట్టు సమాచారం. అర్హులైన దరఖాస్తులను పరిశీలించి అన్ని జిల్లా కలెక్టరేట్లలో టోకెన్ విధానంలో లక్కీడ్రా నిర్వహించి లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు. అవకతవకలకు తావులేకుండా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయనున్నారు. నూతన మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నది. ఈ ఏడాది మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా ప్రారంభం కావడంతో బుధవారం వరకు 30,690 దరఖాస్తులు మాత్రమే అందాయి. చివరి రోజైన గురువారం అనూహ్యంగా మరో 35,762 దరఖాస్తులు రావడంతో మొత్తం 66,452కు పెరిగాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 25 మంది పోటీపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఆ జిల్లాలోని మొత్తం 122 దుకాణాలకు 6,212 దరఖాస్తులు అందాయి. ఒక్కో దుకాణానికి సగటున 51 మంది పోటీలో ఉన్నారు. 2019లో కూడా ఈ జిల్లాలో ఒక్కో దుకాణానికి 48 మంది పోటీపడ్డట్టు అధికారులు తెలిపారు.