తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీరు రావడం లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం అటు తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యధేచ్చగా తరలిస్తోందని మురళీధర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసీ కెనాల్ కోటా 2 టీఎంసీల నీటిని టీబీఆర్బీ హెచ్ఎల్సీకి విడుదల చేయాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అయితే ఇప్పటికే 2 టీఎంసీల నీటిని విడుదల చేశామని, అవిగాక అదనపు నీటి కోసం ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు. ఈ డిమాండ్ కృష్ణ నీటి వివాదం ట్రిబ్యునల్-1 అవార్డ్కు విరుద్ధమని చెప్పారు. ఈ నీటిని విడుదల చేయడం వల్ల ఇప్పటికే తక్కువ నీరు అందుతున్న ఆర్డీఎస్కు నీటి లభ్యత మరింత తగ్గుతుందని వివరించారు. కావున ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని, ఆపై ఆర్డీఎస్కు పూర్తి స్థాయిలో నీటిని అందించాలని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.