హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ఉల్లంఘనలు, చేపట్టిన పనుల వల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు నియమించిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించడాన్ని ఆక్షేపిస్తున్నారు. ఏండ్ల తరబడి నీళ్ల కోసం తండ్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే సంకల్పంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టిందని ఆరోపిస్తూ కడప జిల్లాకు చెందిన రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పనుల వల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టంపై నివేదిక ఇవ్వాలని పర్యావరణ నిపుణుడు గౌరప్పన్కు ఎన్జీటీ బాధ్యతలు అప్పగించింది. ఆ ఏకసభ్య కమిటీ ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. అయినా ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం జరిమానా చెల్లించాలని ఎన్జీటీ తీర్పు ఇవ్వడంపై ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియ చేపట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయడంతోపాటు, డీపీఆర్లను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు, సీడబ్ల్యూసీకి సమర్పించింది.
అధికారులతో రజత్కుమార్ సమీక్ష
ఎన్జీటీ తీర్పు నేపథ్యంలో శుక్రవారం సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ జలసౌధలో సీనియర్ ఇంజినీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఎన్జీటీ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పలువురు ఇంజినీర్లు అభిప్రాయపడినట్టు తెలిసింది. గతంలో పోలవరం, పురుషోత్తమపట్నం, పట్టిసీమ తదితర ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి కూడా ఎన్జీటీ రూ.248 కోట్ల జరిమానా విధించగా, సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టే తెచ్చుకొన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.