హైదరాబాద్ : కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. కృష్ణాజల వివాదాలపై మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలంటూ రాసిన లేఖలపై బోర్డు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ గానీ, కేంద్ర జలశక్తిశాఖ గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, లేఖలో ఏడు ముఖ్యమైన అంశాలతో పాటు 70 లేఖలకు సంబంధించిన వివరాలను ఈఎన్సీ పొందుపరిచారు. తాగునీటి కోసం తీసుకున్న జలాల్లో 20శాతం మాత్రమే లెక్కించాలని ట్రైబ్యునల్ చెబుతోందని, ఇదే విషయాన్ని పలు లేఖల్లో పేర్కొన్నప్పటికీ బోర్డు అమలు చేయలేదన్నారు.
ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాల్సి ఉంటుందని, దీనిపై పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 2015, 2017 సంవత్సరాల్లో అడ్ హక్ ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు చేశారని, తెలంగాణకు 70శాతం నీటిని కేటాయించాల్సి ఉందని, రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50శాతం అయినా కొనసాగించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆరోపించారు.
16వ బోర్డు సమావేశంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఖరారు కోసం సమాచారం, వివరాలు ఇవ్వాలని కేంద్ర జలసంఘాన్ని, బోర్డును కోరినా ఇవ్వలేదని లేఖలో గుర్తు చేశారు. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976-77లో ఇచ్చిన ఒప్పందాలకు లోబడి రూల్ కర్వ్స్ ఖరారు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ రూల్ కర్వ్స్ సవరించలేదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి రూల్ కర్వ్స్ సవరణ చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
స్పిల్ వే ద్వారా విడుదల చేసే నీటిని లెక్కించరాదన్న ఏపీ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని చెప్పినా పట్టించకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాల్వలపై రియల్ టైం డేటా అక్విజేషన్ సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పనులు సాగకుండా ఆటంకాలు కలిగిస్తోందని, పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇంకా పలు అంశాలు పరిష్కారం కాలేదని, వాటన్నింటినిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని బోర్డును ఈఎన్సీ కోరారు.