తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.. మరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్ ) సంగతేందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 86 లక్షల ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేయరా అంటూ నిలదీస్తున్నారు. సీపీఎస్ను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీ సహా యూపీ, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. తెలంగాణకు వచ్చి 10శాతం లోపు ఉద్యోగులను మారిస్తేనే జీవో రద్దుచేయాలంటున్న జేపీ నడ్డాకు.. 86లక్షల ఉద్యోగుల వెతలు పట్టవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియార్టీని పరిగణిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని, ఉద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే డీవోపీటీ మార్గదర్శకాల్లో స్థానికతను చేర్చవచ్చుకదా అంటూ డిమాండ్ చేశారు.
నూతన పెన్షన్ విధానం పట్ల అంతా ఆందోళనగా ఉన్నారు. సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 86 లక్షల మంది ఉద్యోగులు పోరాడుతున్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతున్నారు. మరీ బీజేపీకి 86 లక్షల ఉద్యోగుల వెతలు పట్టవా. సీపీఎస్ ఉద్యోగుల విషయంలో మీ చిత్తశుద్ది ఏడబోయింది. రైతుచట్టాలను రద్దుచేసినట్లుగానే బీజేపీ ప్రభుత్వం సీపీఎస్ను రద్దుచేయవచ్చకదా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టం (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా..?
సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులమంతా ఏడేండ్లుగా పోరాటం చేస్తున్నం. ఎన్నడైనా బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్నదా.. ? మా డిమాండ్ను నెరవేర్చిందా..? జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఆయన్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించాం. అయినా ఈ విషయంపై ఉలుకులేదు పలుకులేదు. తక్షణమే ఉద్యోగులు కోరుకున్నట్లుగా సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి.